బోల్తా పడ్డారు: చిరంజీవిపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు త్యాగధనులని ఆయన అన్నారు. చదువుకున్నవారిని రాజకీయాల్లోకి తెచ్చింది తమ పార్టీయేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో పాత సంస్కృతి మళ్లీ ప్రారంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 1994 - 2004 మధ్య కాలంలో రాష్ట్రాన్ని తాము ప్రపంచ చిత్రపటం మీద నిలిపామని ఆయన చెప్పారు. తాము వినూత్న కార్యక్రమాలు చేపట్టామని, మౌలిక సదుపాయాల కల్పనకు పాదులు వేశామని, సంస్కరణలు తెచ్చామని, ఎన్టీఆర్ హయాంలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, అవినీతిని కాంగ్రెసు పార్టీ ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ విషయంలో ఇందిరా గాంధీ ఓడిపోయారని ఆయన అన్నారు. తాము జాతీయ స్థాయిలో 39 పార్టీలను ఏకం చేసినట్లు ఆయన తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉండి పలు ఎన్నికలను ఎదుర్కున్నామని, ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సార్లు ఎన్నికలు రాలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. ఎమ్మార్ వ్యవహారంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్ రాజశేఖర రెడ్డికి రాసిన రహస్య లేఖను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభ్యులను పశువుల్లా కొని తెస్తున్నారని, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు.