తెలంగాణపై దద్ధరిల్లిన లోకసభ: ప్రణబ్తో చిదంబరం భేటీ
తమ పార్టీ లోకసభ సభ్యులను బుజ్జగించడానికి లోకసభ సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయత్నాలు ఫలించలేదు. సభ వాయిదా పడిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులకు నచ్చజెప్పడం ఎలా అనే విషయంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేసినా తెలంగాణపై ప్రభుత్వం నోరు విప్పడం లేదని బిజెపి లోకసభ పక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు.
తిరిగి సమావేశమైన తర్వాత కూడా లోకసభలో పరిస్థితి మారలేదు. తెలంగాణ సభ్యులు తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ సభను నడిపించడానికి ప్రయత్నించారు. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే తాము అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉండేవాళ్లమని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అంటున్నారు. రాష్టారనికి చెందిన రాజకీయ పార్టీలు తెలంగాణపై ఒక వైఖరిని తీసుకునేంత వరకు తాము ఏమీ చేయలేమని ఆయన చేతులు ఎత్తేసినట్లు సమాచారం. తెలంగాణ లొల్లి సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను తిరిగి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.