జగన్ ఆస్తుల కేసుపై సిబిఐ మరింత దృష్టి, కోర్ట్లో మెమో
సిబిఐ శనివారం జగన్ ఆస్తుల కేసులో ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో జగన్మోహన్ రెడ్డిని ఎ-1 నిందితుడిగా పేర్కొంది. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని ఎ-2 నిందితుడిగా పేర్కొంది. విజయ సాయి రెడ్డిని సిబిఐ ఇప్పటికే అరెస్టు చేసింది. తదుపరి విచారణ కోసం మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని అంటున్నారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన విజయ సాయి రెడ్డి బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ నాలుగో తేదికి వాయిదా వేసింది. కాగా జగన్ ఆస్తుల కేసులో మంగళవారం మరో ఛార్జీషీట్ కూడా సిబిఐ దాఖలు చేసే అవకాశముందని తెలుస్తోంది.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తోసుపుచ్చింది. బెయిల్ విషయం స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అదే సమయంలో బెయిల్ ఇవ్వవద్దన్న హైకోర్టు వ్యాఖ్యలు పట్టించుకోవద్దని సిబిఐ కోర్టుకు సుప్రీం సూచించింది.
మరోవైపు ఎమ్మార్ కేసులో ఎసిబి విచారణను నిలిపి వేయాలన్న ఎంజిఎఫ్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. విచారణ చేసుకోవచ్చునని సూచించింది. ఎమ్మార్ కేసులో ఎసిబి తన వద్ద ఉన్న సమాచారాన్ని సిబిఐకి అందజేయాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది.