తెలంగాణకు అడ్డెవరు?: అధిష్టానంపై మరోసారి కెకె ఫైర్
ప్యాకేజీలతో పని లేదని, తెలంగాణ తప్ప దేనికీ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై తాము పార్లమెంటును స్తంభింపజేశామని, అధికార పార్టీ ఒక అంశంపై పార్లమెంటును స్తంభింపజేయడం చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలే బాధ్యత వహించాలన్నారు. రాజీనామా అనేది వారి ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తామని పార్టీ చెప్పి ఉంటే ఉప ఎన్నికల్లో ఓడిపోయేది కాదని చెప్పారు. తెలంగాణపై చిదంబరం వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనన్నారు. ప్రణబ్ కమిటీకి తెలుగుదేశం పార్టీ గతంలోనే లేఖ ఇచ్చిన సంగతి ఆయన మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఇంకా పార్టీల అభిప్రాయమేంటని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అడ్డంకి ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నేతలందరూ రెండు మూడు రోజుల్లో సమావేశం కానున్నారని వెల్లడించారు.