సిఎంకు చెక్ చెప్పే వ్యూహం!: తెరపైకి బొత్స రాజీనామా
వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం నుండి వీరికి పిలుపు వచ్చింది. ఈ నెల 4న ఢిల్లీ రావాలని ఆదేశించింది. వీరిద్దరూ రేపు ఢిల్లీ వెళుతున్నారు. మద్యం విషయంలో తనను దోషిగా చూపే కుట్ర జరుగుతోందని, తాను నిర్దోషిగా తేలే వరకు మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బొత్స అధిష్టానం వద్ద ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం సానుకూలంగా స్పందిస్తే అప్పటికప్పుడు రాజీనామా చేయాలని బొత్స నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తన రాజీనామా ద్వారా తనను టార్గెట్ చేసుకన్న ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేయాలనేది బొత్స వ్యూహంగా తెలుస్తోంది. ఇటీవల వారం రోజుల క్రితం కూడా బొత్స తన పదవికి రాజీనామా చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలను బొత్స ఆ తర్వాత ఖండించారు. తాను రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే సిఎం తనపై మరింత దృష్టి సారించడంతో రాజీనామాతో సిఎంకు చెక్ చెప్పడమే మంచిదని ఆయన భావిస్తున్నారట.
ఇప్పటికే మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి శంకర రావు తదితరుల ఫిర్యాదులు అధిష్టానం వద్ద ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా కిరణ్ ఉంటే 2014లో పార్టీకి నష్టమని, తెలంగాణ ప్రాంత ఎంపీలు, పలువురు ఇతర నేతలు కూడా కిరణ్ వ్యవహారం సరిగా లేదంటూ ఫిర్యాదులు చేశారు. తాజాగా తన రాజీనామాతో సిఎం మరింత ఇరకాటంలో పడక తప్పదని బొత్స వర్గీయులు భావిస్తున్నారట.