ఎసిలు వేసుకుంటే పెరగవా?: ఆనం వివేకానంద ప్రశ్న
కాంగ్రెసు పాలనలో ఇంతవరకు ఛార్జీలు ఒక్కసారి మాత్రమే పెరిగాయన్నారు. యాభై యూనిట్ల వరకు వాడుకునే వారికి అసలు ఛార్జీ పెరగలేదని, 50-100 యూనిట్ల మధ్య కూడా 20 పైసలే పెంచామని ఆయన చెప్పారు. పదిలక్షల మంది రైతులకు కాంగ్రెసు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇస్తుందని ఆయన గుర్తు చేశారు.
నెల్లూరు పార్లమెంటు సభ్యుడుగా కాంగ్రెసు పార్టీ నుండి ఎవరు పోటీ చేసినా ఆయన విజయానికి కృషి చేస్తామని చెప్పారు. పార్టీ అధిష్టానం తనకు టిక్కెట్ కేటాయించినా ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. నెల్లూరు ఎంపీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
కాగా ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా రెండు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.