పరకాలలో మద్దతివ్వమన్న నళిని, కుదరదన్న బిజెపి!
పరకాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేస్తే ఆ స్థానంపై జాతీయ స్థాయి చూపు ఉంటుందని, అది తెలంగాణపై రెఫరెండంగా భావించే అవకాశాలు ఉన్నాయని వారితో చెప్పానని ఆమె అన్నారు. తనకు మద్దతిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని వివరించినట్లు చెప్పారు. అయితే తాము పరకాలలో పోటీ చేయాలని నిర్ణయించినందున మద్దతు ఇవ్వడం కుదరదని నళినికి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం.
కాగా తాను వచ్చే ఉప ఎన్నికల్లో తాను పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ డిఎస్పీ నళిని ఆదివారం తెలిపిన విషయం తెలిసిందే. పరకాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ను కలిసి తనకు మద్దతివ్వాలని తాను ఇప్పటికే విజ్ఞప్తి చేశానని ఆమె చెప్పారు. కాగా ఇటీవల ఆమె జెఏసి నేతలను కలిసి తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత కొండా సురేఖ ఇటీవల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గం ఖాళీ అయింది.
అక్కడ నుండి పోటీ చేసేందుకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలుపొందారు. అదే ఉత్సాహంలో పరకాలను కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోటీపై తర్జన భర్జన పడుతున్నారు. అదే సమయంలో నళిని పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.