వేర్వేరుగా వెళ్లిన బొత్స, కిరణ్: సిఎం మార్పుపై పుకార్లు
కాగా కిరణ్, బొత్సల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వివాదంతో పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. మద్యం సిండికేట్ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ పిసిసి చీఫ్ బొత్సను టార్గెట్ చేసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంలో బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఇదే విషయాన్ని ఓ లేఖ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లారనే వాదనలు వినిపించాయి.
ఇప్పటికే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పొందింది. వీరి మధ్య ఉన్న విభేదాలు త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో పడనుందని పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య సయోద్య కుదిర్చేందుకు పార్టీ పెద్దలు వారిని రెండు రోజుల క్రితం ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు.
అధిష్టానం పిలుపు మేరకు బొత్స, కిరణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తుందని అది కుదరకుంటే ఎవరో ఒకరి మార్పు ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
సిఎం మార్పుపై ఊహాగాలు:
కాగా ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. అధిష్టానం రాజీ కుదిర్చినప్పటికీ ఇరువురి మధ్య సయోధ్య కుదరకపోతే కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి తెలంగాణ ప్రాంతంలోని ఓ నేతకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నదని అంటున్నారు.
మాజీ పిసిసి చీఫ్, శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల పేర్లు వినవస్తున్నాయని తెలుస్తోంది. బొత్సను తప్పించిన పక్షంలో ఆయన స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం అధిష్టానం దృష్టిలో ఇప్పటికే ఉందని అంటున్నారు. సయోధ్య కుదరకపోతే ఎవరినో ఒకరని ఎట్టి పరిస్థితిల్లోనూ తప్పిస్తారని అంటున్నారు.