'హైకోర్టులో సకల సమ్మె': ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
హైకోర్టు లోపల లాయర్లు ఆందోళన చేస్తే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నించింది. కోర్టు హాలులోనే ఆందోళనపై సుప్రీం ఆశ్చర్యం వెలిబుచ్చింది. జడ్జీలను బెదిరించే పరిస్థితి ఉందంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోక పోవడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.
తెలంగాణ న్యాయవాదుల నుండి న్యాయమూర్తులకు రక్షణ కల్పించక పోవడంపై ప్రభుత్వంపై మండిపడింది. హైకోర్టు జడ్జీలు, న్యాయవాదుల భద్రతపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్ట్రార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి)లను ఆదేశించింది. సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు....
హైకోర్టు ఆవరణలో దీక్ష చేయడానికి న్యాయవాదులకు అనుమతి ఎవరిచ్చారు? ఆందోళన చేస్తున్న వారిని బయటకు ఎందుకు పంపలేదు? కోర్టు గదిలోకి వెళ్లి గొడవ చేస్తుంటే పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదు? న్యాయమూర్తులనే బెదిరించే పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? జడ్జిలు, లాయర్ల భద్రతకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు? ఈ ఘటనలో ఎంతమందిని అరెస్టు చేశారని సుప్రీం ప్రశ్నించింది.
కాగా తెలంగాణ కోసం గత సంవత్సరం జరిగిన సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ ప్రాంత లాయర్లు హైకోర్టులో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వారు కోర్టు కార్యకలాపాలు అడ్డుకున్నారు. తెలంగాణ ఇచ్చే వరకు హైకోర్టును నడవనివ్వమని హెచ్చరించారు.