కిరణ్పై నెగ్గిన బొత్స, స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ
స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కుంటే తమ బలాబలాలు తెలిసి వస్తాయని, దాని ఆధారంగా ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి పొరపాట్లను సరిదిద్దకోవచ్చుననేది బొత్స సత్యనారాయణ వాదన. అయితే, అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విముఖంగా ఉన్నట్లు చెబుతూ వస్తున్నారు. బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలతో చర్చించిన తర్వాత ఉప ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటే త్వరలో 18 శాసనసభ స్థానాలు, నెల్లూరు పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, పంచాయతీ, సహకార ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. స్థానిక సంస్థలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం భయపడుతోందని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది. అందువల్ల తాము భయపడడం లేదనే సంకేతాలను కూడా ఎన్నికల నిర్వహణ ద్వారా ఇవ్వాలనేది కాంగ్రెసు ఉద్దేశంగా కనిపిస్తోంది.
మే నెల 10వ తేదీలోపు సహకార ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనే మున్సిపల్, పంచాయతీ, సహకార ఎన్నికలపై వ్యతిరేకత వచ్చింది. అకాల వర్షాలు, కరువు, కరెంట్కోత తదితరవాటిపై ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. దీంతో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంకా వాయిదా వేయడం సరికాదని, ఇప్పుడు తప్పనిసరి కావడంతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.