ఇండియన్ రైల్వేలో పట్టాలెక్కనున్న రైలు భీముడు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని లోకోమోటివ్ వర్క్స్లో ఈ ఇంజన్ తుది మెరుగులు దిద్దుకుంటుందంట. దీనికి రైల్ భీమగా నామకరణం చేశారు. పేరుకు తగ్గట్లే ఈ రైలు ఇంజన్ అధిక బరువులను మోయగలదు. ప్రస్తుతం ఉన్న రైలింజన్ల సామర్థ్యం కంటే దీనిది చాలా ఎక్కువగా ఉంటుందట.
ప్రస్తుతం దేశంలో 4500 హార్స్ పవర్ గల డీజిల్ ఇంజన్లనే సరుకుల రవాణాకు భారతీయ రైల్వే వినియోగిస్తుంది. రైల్ భీమ్ శక్తి వీటి కన్నా వెయ్యి హార్స్ పవర్స్ ఎక్కువగా ఉంది. దీంతో భారతీయ రైల్వేకు సరుకుల రవాణా సామర్థ్యం పెరుగుతుంది. రైల్ భీమ తయారీ వ్యయం పదిహేడు కోట్ల రూపాయలు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఇంజిన్లను పదిహేను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్ భీమ్ ప్రవేశంతో భారతీయ రైల్వేల సామర్థ్యం పెరగనుంది. రైల్ భీమ్ ఇంజిన్లను రైల్వే శాఖ.. ఆమెరికాకు చెందిన ఈఎండి సంస్థ భాగస్వామ్యంతో రూపొందిస్తోంది. ఈ ఇంజిన్లో డ్రైవర్లకు ఆధునిక భద్రత ఏర్పాట్లతో పాటు మరిన్ని సదుపాయాలు ఉన్నాయి.