దిగొచ్చిన నవీన్: 27 మంది మావోల విడుదలకు రెడీ
లక్ష్మిపూర్ యువ శాసనసభ్యుడు హికాకా భద్రతను దృష్టిలో పెట్టుకుని కోరాపుట్, మల్కాన్గిరి జైళ్లలో ఉన్న చాసి ములియా ఆదివాసీ సంఘ సభ్యులు 15 మందిని, మావోయిస్టు తీవ్రవాదులను ఎనిమిది మందిని విడుదలకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని నవీన్ పట్నాయక్ శానససభలో చెప్పారు. మంత్రి వర్గ సమావేశానంతరం ఆయన శాసనసభలో ఆ ప్రకటన చేశారు.
పావోలా విడుదలకు మావోయిస్టులు చెప్పిన మధ్యవర్తులు బిడి శర్మ, దండపాణి మొహంతిలతో చర్చలు జరిపిన తర్వాత 27 మందిని విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. పావోలాను మరో ఇటాలియన్ క్లాడియో కొలాంజిలోతో పాటు మార్చి 14వ తేదీన మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కొలాంజిలోను మావోయిస్టులు మార్చి 25వ తేదీన వదిలేశారు. హికాకా విడుదలకు కోరాపుట్, మల్కాన్గిరి జైళ్లలో తమ సహచరులను 70 మందిని విడుదల చేయాలని మావోయిస్టు ఆంధ్ర - ఒడిషా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిమాండ్ చేసింది.
హికాకాకు, ఇటాలియన్ విడుదలకు తాము విడుదల చేసే ఖైదీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటిస్తుంది. ప్రభుత్వం నుంచి రాతపూర్వకమైన హామీ వస్తే తప్ప తామేమీ చెప్పలేమని మధ్యవర్థి దండపాణి మొహంతి అంటున్నారు. ఏడుగురు తిరుగుబాటుదారులు గణపతి పాత్రా, సుభాశ్రీ దాస్, కమల్కాంతా సేథీ, సుజాత, సిక్ నచికా, ఆరతి మజీ, సుదర్శన్ మండల్ విడుదలకు మావోయిస్టు నేత సవ్యసాచి పాండా మధ్యవర్తుల ద్వారా డిమాండ్ చేశారు.