ఐసోలేషన్ నుండి పరారైన 11మంది ఎబోలా పేషెంట్ లు.. కొత్త టెన్షన్!
ఆఫ్రికా ఖండంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఈ వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో అక్కడ చోటుచేసుకున్న కొన్ని తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. కాంగోలోని ఇటూరి ప్రావిన్స్లో గల అధికారిక క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఎబోలా బారిన పడిన 11 మంది పేషంట్లు పారిపోయారు.
పారిపోయిన ఎబోలా రోగులు, ఎబోలా మృతుని అంత్యక్రియల బృందంపై దాడి
అత్యంత వేగంగా వ్యాపించే గుణమున్న ఈ వైరస్ సోకిన రోగులు సమాజంలో తిరగడం వల్ల మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.మరోవైపు, దక్షిణ కివు పరిధిలోని కటానా పట్టణంలో ఒక ప్రమాదకరమైన సంఘటన వెలుగుచూసింది. ఎబోలా బారిన పడి మరణించిన ఒక వ్యక్తికి శాస్త్రీయపద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి వెళ్లిన ప్రత్యేక రక్షణ బృందంపై కొందరు స్థానికులు దాడికి తెగబడ్డారు.

ఎబోలా ముప్పుపై ఆందోళన
ఈ అకస్మాత్తు దాడితో భయాందోళనలకు గురైన సదరు బృందం, మృతదేహాన్ని అక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయింది. అనంతరం స్థానిక ప్రజలే ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా ఆ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎబోలా మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండటంతో, ఈ ఘటన వల్ల ఆ ప్రాంతంలో వైరస్ చైన్ మరింత విస్తరించే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య సిబ్బందికి సవాలుగా మారిన దాడులు
ఈ సంక్షోభ సమయాల్లో కొన్ని ప్రావిన్స్లలో క్రియాశీలకంగా ఉన్న సాయుధ ముఠాలు, తిరుగుబాటుదారులు అంతర్జాతీయ సంస్థలు అందిస్తున్న మానవతా సాయానికి, వైద్య సేవల సరఫరాకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నారు. భద్రతా లోపాలు మరియు వైద్యులపై దాడుల భయం కారణంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి బాధితులను గుర్తించడం ఆరోగ్య సిబ్బందికి సవాలుగా మారింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 363 ఎబోలా పాజిటివ్ కేసులు, వ్యాప్తి ఆందోళన
కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 363 ఎబోలా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వేరియంట్ అయిన 'బుండిబుగ్యో' కారణంగా ఇప్పటివరకు 62 మంది మరణించారు. పొరుగు దేశమైన ఉగాండాలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అక్కడ 15 కేసులు నమోదు కాగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియను ముమ్మరం చేశాయి.












Click it and Unblock the Notifications