గెలిచిన వెంటనే పీకే బంపర్ గిఫ్ట్! 10 వేల జాబ్స్, నెలకు రూ.1100 పింఛన్..
బీహార్ రాజకీయంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్, ఎన్నికల విజయం అనంతరం తన నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. దశాబ్దాలుగా ఉపాధి లేక నలిగిపోతున్న యువతకు సరికొత్త ఆశలు చిగురింపజేశారు. బాంకీపూర్లో సుదీర్ఘకాలంగా విరాజిల్లుతున్న బీజేపీ కోటను బద్దలు కొట్టి ఘన విజయం సాధించిన అనంతరం, తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించిన పి కె.. స్థానిక నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగాలు ఇప్పిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, చదువుకున్న నిరుద్యోగుల బయోడేటాలు, సివిలను తన కార్యాలయానికి పంపాల్సిందిగా కోరారు.
రాష్ట్రవ్యాప్త నెట్వర్క్తో ప్రైవేట్ కొలువులు
ఎన్నికల ఫలితాల తర్వాత ఐదారు రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారంటూ వస్తున్న విమర్శలను ప్రశాంత్ కిషోర్ తిప్పికొట్టారు. "నేను ఎక్కడికీ పోలేదు, మీ భవిష్యత్తు కోసమే ప్రణాళికలు రచిస్తున్నాను" అని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో ఉన్న తనకున్న వ్యక్తిగత సంబంధాలను, నెట్వర్క్ను ఉపయోగించి బాంకీపూర్ నియోజకవర్గంలోని కనీసం 10,000 కుటుంబాల్లోని యువతకు ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అబద్ధాలు చెప్పనని, ప్రారంభంలో కొన్ని ఉద్యోగాల కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సి రావచ్చు అని నిజాయితీగా వెల్లడించారు. భవిష్యత్తులో జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్లోనే పుష్కలమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
30 ఏళ్ల బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి చెక్!
ఆగస్టు 3న వెలువడిన ఫలితాలలో బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఏకంగా 19,324 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను మట్టికరిపించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా, బీజేపీకి 44,827 ఓట్లు, ఆర్జేడీ మూడో స్థానానికి పరిమితమైంది. బిజెపికి బలమైన కోటగా ఉంటూ, గత ముప్పై ఏళ్లుగా ఆ పార్టీకి తిరుగులేని సీటుగా ఉన్న బాంకీపూర్ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రశాంత్ కిషోర్ సరికొత్త సంచలనం సృష్టించారు.
రాబోయే రెండు మూడు నెలల్లో మార్పు స్పష్టం!
తాను ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన బాంకీపూర్ రాత్రికి రాత్రే 'బెంగళూరు'లా మారిపోదని స్పష్టం చేసిన పీకే, రెండు మూడు నెలల వ్యవధిలోనే మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఉద్యోగాలే కాకుండా విద్య, రూ. 1,100 నెలవారీ పింఛను , ఉచిత రేషన్ సరుకులను తన ప్రాధాన్యతలుగా ఎంచుకున్నట్లు తెలిపారు. మాటల కంటే చేతల్లోనే మార్పు చూపిస్తానని హామీ ఇస్తూ, ప్రజా సంక్షేమానికి సరికొత్త రోడ్మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications