సిబిఐ ఎదుట హాజరైన మరో ఐఎఎస్ అధికారి
విల్లాల విక్రయాలకు సంబంధించి ముందస్తు సమాచారం లేకుండా ఏర్పాటైన ఎంజిఎఫ్, స్టైలిష్ హోమ్ ఒప్పందాల వ్యవహారాల గురించి ప్రత్యేకించి తుమ్మల రంగారావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విల్లా స్థలాలను ఎక్కువ ధరలకు విక్రయించుకోవడం ద్వారా స్టైలిష్ హోం అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని సిబిఐ ఇప్పటికే అబియోగ పత్రంలో నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. ఎమ్మార్ బిల్డర్ హిల్స్ లీజర్ ప్రైవేట్ లిమిటెడ్కు కూడా అంతర్గత భూ బదలాయింపులపై కూడా తుమ్మల రంగారావు నుంచి సిబిఐ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడైన తుమ్మల రంగారావు అప్రూవర్గా మారడానికి సిద్ధపడ్డారు. అలా మారడం వల్ల తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కూడా కోరారు. తాను సిబిఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించలేదు.
ఇదిలావుంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు ఇప్పటికే పలువురు ఐఎఎస్ అధికారులను ప్రశ్నించారు. విల్లాలు కొనుగోలు చేసినవారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మహేష్ బాబు, రామచరణ్ తేజ వంటి సినీ ప్రముఖులు, డి. శ్రీనివాస్ వంటి రాజకీయ నాయకుల వాంగ్మూలాలను సిబిఐ సేకరించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఇప్పటి వరకు సిబిఐ నలుగురిని అరెస్టు చేసింది. బిపి ఆచార్య, సునీల్ రెడ్డి, విజయ రాఘవ, కోనేరు ప్రసాద్లను సిబిఐ అరెస్టు చేసింది.