ఉప ఎన్నికల ప్రకటన, సమరోత్సాహంలో వైయస్ జగన్
సిఈసి ప్రకటనను బట్టి జూన్లోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జూన్ అంటే ఎక్కువగా సమయం లేనట్లే. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలోకి అడుగు పెట్టే లోపల ఒక దశ ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని జగన్ భావిస్తున్నారు. దీంతో ఆయన తెరిపి లేకుండా తిరుగుతున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
ఉప ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత జరేగేలా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావించారు. దాంతో ఆగస్టులో మాత్రమే ఉప ఎన్నికలు జరుగుతాయని ఇప్పటి వరకూ అనుకుంటూ వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం ఫలించకపోవడంతో ఎన్నికలు జూన్లోనే వచ్చేలా ఉన్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సాధ్యమైనంత త్వరగా ఉప ఎన్నికలను ఎదుర్కోవాలనే ఉత్సుకతతో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి భవిష్యత్తును తేల్చేవి కావడంతో జగన్ మాత్రమే కాకుండా బొత్స సత్యనారాయణ కూడా ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.
ఉప ఎన్నికలు ఆలస్యంగా వస్తే ప్రజల్లో తన పట్ల ఉన్న సానుభూతి తగ్గవచ్చునని జగన్ అనుకుంటున్నారు. అది తరిగిపోకుండా ఉండేందుకే ఆయన విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. పైగా, అనర్హత వేటు పడినవారు తిరిగి ఎన్నికలకు రావడంలో ఆలస్యమైతే వేడి తగ్గవచ్చు. అందుకే త్వరగా ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ భావిస్తున్నారు. నిజానికి ఇటీవల ముగిసిన ఏడు శాసనసభా స్థానాలతో పాటే ఈ స్థానాలకు కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అయితే, ముఖ్యమంత్రి వ్యూహం వల్ల అలా జరగలేదు. ఇప్పుడు తాము భావించిన సమయానికి ఎన్నికలు వస్తున్నాయని, తాము వాటిని ఎదుర్కుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.