మాఫియా పాలన: బాబు, పార్టీ మీటింగ్లో హరికృష్ణ
కాంగ్రెసు ప్రజల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వముందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతోనే ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెసుదే అన్నారు. సెజ్ ల పేరిట పేదల పొట్ట కొడుతున్నారన్నారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి విపరీతంగా పెరిగిందన్నారు.
నిత్యావసరాలు, పెట్రోలు, కరెంట్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. చాలాచోట్ల నీటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచితంగా ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్రంలోని అనిశ్చితికి కాంగ్రెస్సే కారణమన్నారు. ఆ సమస్య తీర్చాల్సింది కాంగ్రెస్ అన్నారు.
కాగా ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ హాజరయ్యారు. ఇటీవల హరికష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన విభేదాలు లేవని చెప్పారు. శుక్రవారం సమావేశానికి హాజరయ్యారు. కాగా అంతకుముందు చంద్రబాబు హైటెక్ సిటీలో ఫోటో ఎక్స్పో-2012 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పరిశ్రమలకు తోడ్పాటునందించాలన్నారు. ప్రజల సౌకర్యార్థం కట్టించిన హైటెక్స్ పెళ్లిళ్లకే పరిమితం కావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.