పంతం నెగ్గించుకున్న 'కిరణ్', తప్పుకున్న ఎసిబి జెడి
ఎసిబి జెడి శ్రీనివాస్ రెడ్డి బదలీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన బదలీ ఉత్తర్వులను తీసుకోలేదు. ఎసిబి డైరెక్టర్ భూపతిబాబు కూడా శ్రీనివాస్ రెడ్డిని రిలీవ్ చేసేందుకు ససేమీరా అన్నారు. దీంతో ఇది రాష్ట్రంలో సంచలనం రేపింది. ఎలాగైనా శ్రీనివాస్ రెడ్డిని బదలీ చేయాలన్న ఉద్దేశ్యంతో కిరణ్ ప్రభుత్వం శుక్రవారం ఛార్జ్ మెమో ఇచ్చింది. దీనిని పోలీసులు సమక్షంలో ఆయనకు ఇచ్చారు.
భూపతి బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపారు. శ్రీనివాస్ రెడ్డిని రిలీవ్ చేయవద్దని ఆయన సిఎస్ను కోరారు. అయితే రిలీవ్ చేయాల్సిన ఆవశ్యకతపై సిఎస్ భూపతిబాబుకు వివరించారని తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డితోనూ చర్చలు జరిపిన అనంతరం బదలీ ఓకే అయింది. ఈ సమన్వయానికి డిజిపి కృషి చేశారు. కాగా శ్రీనివాస్ రెడ్డి స్థానంలో శివధర్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే.
కాగా అంతకుముందు అఖిలపక్షం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసింది. నిజాయితీ అధికారి అయిన శ్రీనివాస్ రెడ్డిని రిలీవ్ చేయవద్దని సిఎంను కోరింది. కుంభకోణంలో మంత్రుల ప్రత్యక్ష ప్రమేయంపై రుజువులు బయటపడుతున్న నేపథ్యంలో దర్యాఫ్తును నీరుగార్చే విధంగా చేయవద్దని కోరారు. అందుకు కిరణ్ ఎసిబిలో నిజాయితీగా పని చేసే అధికారులు ఎంతో మంది ఉన్నారని వారికి సమాధానం ఇచ్చారు. మద్యం సిండికేట్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సిఎం వారికి హామీ ఇచ్చారు.