వైయస్కు చెప్పినా తప్పించలేదు: సిబిఐ ఎదుట సబిత
ఈ విషయంలో పలు దఫాలుగా తాను వైయస్తో చర్చించానని ఆమె చెప్పారు. రాజగోపాల్ వద్ద ఉన్న రెండు పోస్టుల్లో ఒకదాంట్లో మరో అధికారిని నియమించాలని కోరానని, అయితే ఆయన స్థానంలో పని చేయడానికి మరో సమర్థుడైన అధికారి లేకపోవడంతో తప్పించలేక పోతున్నట్లు వైయస్ చెప్పారన్నారు.
గనుల లీజుల మంజూరు కోసం అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మిపై వైయస్ ఒత్తిడి తెచ్చారనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఒఎంసికి సాంకేతికంగా నిపుణులైన అధికారుల సిఫార్సుల ఆధారంగానే లీజు అనుమతులిచ్చామని, 68.5 హెక్టార్లకు సంబంధించి ఒఎంసికి లీజు మంజూరుపై సంతకం చేసిన విషయం వాస్తవమేనని ఆమె చెప్పారు.
సాధారణంగా కార్యదర్శి సిఫార్సులను యథాతథంగా ఆమోదిస్తామని, నిబంధనలకు అనుగుణంగా మాకు మార్గదర్శనం చేయాల్సింది కార్యదర్శేనని, అంతేకాకుండా సంబంధింత అంశంపై వస్తవాలను కూడా వారే తెలియజేయాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగానే ఫైలు తన వద్దకు వచ్చిందని, దాన్ని క్లియర్ చేసి పంపానని చెప్పారు. క్యాప్టివ్ అన్న పదం తనకు పంపిన ఫైలులో ఉందని, జివోలో తొలగించిన విషయం మాత్రం తనకు తెలియదన్నారు.
అలాగే ఎపిఎండిసికి రిజర్వ్ చేసిన 25 హెక్టార్లను కేటాయించాలని గాలి జనార్ధన్ రెడ్డి వైయస్కు దరఖాస్తు చేసుకున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ దరఖాస్తు ఆధారంగానే 25 హెక్టార్లను కేటాయించడానికి శ్రీలక్ష్మి ప్రయత్నించగా అలాంటివి విరమించుకోవాలని ఆమెకు సూచించానని చెప్పారు. కాగా ఒఎంసి కేసులో శ్రీలక్ష్మిపై అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ సబితా ఇంద్రా రెడ్డిని 8 సాక్షిగా పేర్కొంది.