పరిస్థితిని బట్టి కర్ఫ్యూపై నిర్ణయం: సబితా ఇంద్రా రెడ్డి
పాతబస్తీలో అంతా ప్రశాంతంగా ఉందని ఆమె చెప్పారు. ఈ అల్లర్లు ఉద్దేశ్య పూర్వకంగా జరుగుతున్నాయా, ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా, వారి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మాదన్నపేటలో జరిగిన అల్లర్ల విషయంలో ఇప్పటికే 26 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఆమె చెప్పారు. నిందితులను ఉపేక్షించేది లేదన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో మాదన్నపేట, సైదాబాద్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో తాను ఉదయం పర్యటించానని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారన్నారు.
మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో జరిగిన అల్లర్ల అంశంపై ఆమె మాట్లాడారు. సంగారెడ్డి అల్లర్ల బాధితులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కాగా శనివారం అర్ధరాత్రి నుండి మాదన్నపేటలో రెండు వర్గాల మధ్య అల్లర్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవి ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.