గుల్బర్గ అల్లర్ల కేసులో సిఎం నరేంద్ర మోడీకి క్లీన్ చిట్
బాధితురాలు జకియా జాఫ్రీ ఫిర్యాదు మేరకు ఆమె పేర్కొన్న నిందితులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, వారు నేరం చేసినట్టు ఎక్కడా నిరూపితం కాలేదని సిట్ నివేదిక తెలుపుతుందని మెట్రోపాలిటన్ మెజిస్ట్రీట్ ఎంఎస్ భట్ మంగళవారం చెప్పారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మరికొందరిపై జకియా జాఫ్రీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన సిట్ నివేదిక ఇచ్చిందని మెజిస్ట్రీట్ చెప్పారు. దానిని మూసి వేస్తున్నట్లు పేర్కొందన్నారు.
ఫిర్యాదు చేసిన జక్రియా జాఫ్రీకి తుది నివేదిక కాపీని ఇవ్వాలని కోర్టు సిట్ను ఆదేశించింది. జకియా జాఫ్రీ 2002 గుల్బర్గా అల్లర్లలో మృతి చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఇషాన్ జాఫ్రీ సతీమణి. ఈ అల్లర్లలో ఇషాన్తో సహా 69 మంది మృతి చెందారు. ఈ ఘటన ఫిబ్రవరి 28, 2002లో చోటు చేసుకుంది.
జాఫ్రీ నెల రోజుల్లో సిట్ నుండి కాపీ పొందవచ్చునని మెజిస్ట్రీట్ చెప్పారు. కాగా ఈ అల్లర్లలో తన భర్తను పోగొట్టుకున్న జకియా జాఫ్రి అల్లర్లకు నరేంద్ర మోడితో సహా యాభై మందిని నిందితులుగా పేర్కొంటూ ఫిర్యాదు చేశారు. ఈ అల్లర్లు గోద్రా సంఘటన అనంతరం జరిగాయి.