దళిత వ్యతిరేకిగా వైయస్సార్పై ముద్ర వ్యూహమేనా?

తాజాగా, కేంద్ర మత్రి పనబాక లక్ష్మి వైయస్ రాజశేఖర రెడ్డిని తప్పు పట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల దళితులకు ఒరిగిందేమీ లేదని ఆమె తన కృష్ణా జిల్లా పర్యటనలో అన్నారు. మంత్రి కొండ్రు మురళి ప్రారంభించిన ఈ విమర్శలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. కొండ్రు మురళి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు ముఖ్యమంత్రి అధిష్టానం వద్ద పట్టుబట్టి మంత్రి పదవి ఇప్పించుకున్నారు. దాంతో ముఖ్యమంత్రి వ్యూహంలో భాగంగానే కొండ్రు మురళి దాన్ని చర్చకు పెట్టారని అనుకోవాల్సి వస్తోందని అంటున్నారు.
వి. హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. కానీ కొత్తగా దళిత నాయకులు వైయస్సార్పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దళితులు ఎక్కువగా వైయస్ జగన్ వెంట వెళ్తున్నారనే అభిప్రాయం కాంగ్రెసు నాయకులు నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి వద్ద వెల్లడించారు. వారిని తిరిగి తమ వైపు రప్పించుకోవడానికి సబ్ ప్లాన్ను చూపించాలని చెప్పారు. అదే సమయంలో పరోక్ష దాడికి ఆయన వ్యూహరచన చేసినట్లు తాజా పరిణామాలు గమనిస్తే అర్థమవుతోందని అంటున్నారు.
కొండ్రు మురళి విమర్శలు ప్రారంభించిన తర్వాత పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వైయస్ రాజశఖర రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. దళితులకు వైయస్ రాజశేఖర రెడ్డి అన్యాయం చేశారని ఆయన అంటున్నారు. ఇలా ఒక్కొరక్కరే దళిత కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం ద్వారా దళితుల్లో వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేక భావన ముప్పిరిగొనేలా చేయాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆ రకంగా ఎస్సీలను జగన్కు దూరం చేయాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.
వైయస్ జగన్ అవినీతికి వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా బాధ్యుడిగా చిత్రీకరించడం, దళితుల వ్యతిరేకిగా చిత్రించడం జగన్ను దెబ్బ తీయడానికి పనికి వస్తుందని అనుకుంటున్నారు. వైయస్ అవినీతికి పాల్పడ్డాడా, లేదా అనేది సిబిఐ విచారణలో తేలుతుందని కొంత మంది కాంగ్రెసు నాయకులు గోడ మీది పిల్లివాటంగా మాట్లాడడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ తమకు ఉపయోగపడనప్పుడు ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేక భావనను కల్పించే వ్యూహాన్ని కాంగ్రెసు నాయకత్వం ఎంచుకుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications