అధిష్టానానికి హామీ!: బైపోల్స్లో గెలుపుపై చిరు దృష్టి

తనకు ఉన్న ఇమేజ్ కారణంగా ఇప్పటికిప్పుడు ఆయన ప్రచారానికి వెళ్లక పోయినప్పటికీ ఆయా నియోజకవర్గాలలోని పార్టీ పరిస్థితిలు, విభేదాలు, ఎవరిని నిలబెడితే గెలుపు ఖాయమనే తదితర అంశాలపై ఆయన దృష్టి సారిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసినట్లుగా తెలుస్తోంది.
ఉప ఎన్నికలలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఆయన వారితో చర్చించారు. చిరు ఉదయం కిరణ్తో, సాయంత్రం బొత్సతో భేటీ అయ్యారు. కనీసం ఆరు స్థానాలు.. తిరుపతి, నరసాపురం, రామచంద్రాపురం, పాయకరావుపేట, నరసన్నపేట, ఆళ్లగడ్డలలో విజయావకాశాలు బాగా ఉన్నాయని సర్వే నివేదికలు చెబుతున్నట్లు వారి మధ్య చర్చల్లో వచ్చినట్లుగా తెలుస్తోంది.
నాయకులమంతా ఐక్యంగా కష్టపడితే మరికొన్ని స్థానాలను కైవసం చేసుకోవచ్చునని చిరు వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ దిశలో చొరవ చూపాలని వారు భావించారట. ఎన్నికల్లో బాగా కష్టపడిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవుల పంపిణీలో ప్రాధాన్యమివ్వాలని చిరు సూచించారు. అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే ప్రకటిస్తే కాంగ్రెసుకు లాభం జరుగుతుందని ఆయన వారితో చెప్పారు.
మిగిలిన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లి పార్టీ అభ్యర్థులను కూడా త్వరగా ప్రకటించే అంశంపై వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి సహా అన్ని చోట్లా గెలుపొందే వారిని గుర్తించి ఎంపిక చేయాలని, ఇతర అంశాలను పట్టించుకోరాదని వారు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications