జగన్ను ఎందుకు అరెస్టు చేయరు: రేవంత్ రెడ్డి

విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్న వైయస్ జగన్ అధికారం కోసం చేసిన ప్రయత్నాలు ఏమిటో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవం రాక ముందే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కూర్చుని శాసనసభ్యుల సంతకాలు సేకరించిన మాట నిజం కాదా, చిరంజీవి నివాసానికి వెళ్లి మద్దతు కోరిన మాట వాస్తవం కాదా చెప్పాలని ఆయన వైయస్ జగన్ను డిమాండ్ చేశారు. ఇంటింటికీ వెళ్లి సంతకాలు పెట్టాలని బతిలాడుకోలేదా అని ఆయన అడిగారు. కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే ఆస్పత్రికి వెళ్తాం లేదా సంఘటనా స్థలానికి వెళ్తారు, కానీ వైయస్ మరణించినప్పుడు వైయస్ జగన్ అధికారం కోసం సంతకాల సేకరణ జరిపారని ఆయన అన్నారు.
2004కు ముందు పాదయాత్రలో వైయస్ రాజశేఖర రెడ్డి అస్వస్థతకు గురైతే పార్టీ నాయకులందరూ వెళ్లి పరామర్శించారని, కానీ వైయస్ జగన్ ఆ ఛాయలకు కూడా వెళ్లలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో వైయస్ రాజశేఖర రెడ్డి పేరుతో సానుభూతి పొంది ఓట్లు సంపాదించుకోవడానికి రెండున్నరేళ్లుగా ఊరూరూ తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అవే విలువలైతే తమకు అక్కర్లేదని ఆయన అన్నారు.
విశ్వసనీయత గురించి మాట్లాడుతున్న వైయస్ జగన్ తన కారణంగా జైళ్లలో మగ్గుతున్న అధికారుల కుటుంబాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అడిగారు. జైళ్లో మగ్గుతున్న అధికారుల కుటుంబాలను వైయస్ జగన్ ఎందుకు ఓదార్చడం లేదని ఆయన అడిగారు. వారి కేసులను వాదించడానికి న్యాయవాదులను ఎందుకు పెట్టడం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్కు ప్రయోజనం చేకూర్చడానికి ఆ అధికారులు పనిచేశారని ఆయన అన్నారు. తన కేసులకు మాత్రం న్యాయవాదులను మాట్లాడుకున్న వైయస్ జగన్ వారిని వదిలేశారని ఆయన అన్నారు.
తాను రాష్ట్రంలో 35 పార్లమెంటు సభ్యులను గెలుచుకుని యుపిఎకు మద్దతిస్తానని చెబుతున్నారని, అది కాంగ్రెసు కాదా అని ఆయన అన్నారు. జగన్ కుమ్మక్కయి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కమ్మక్కయ్యారని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. సామాజిక న్యాయం సాధిస్తానని చిరంజీవి కాంగ్రెసు పార్టీలో కలిసిపోయారని, సోనియా దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతి ద్వారా సీట్లు సాధించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్కు సచివాలయమే దేవాలయం, ముఖ్యమంత్రి సీటే దైవం అని ఆయన వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలను, ముఠా రాజకీయాలను చేసేవారు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. జగన్ అధికారమే మార్గం, దోపిడే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ కాంగ్రెసులో కలవడం ఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications