వైయస్ జగన్ మధ్యంతర ఎన్నికల ఆశలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా రెండు రోజులుగా మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికల తర్వాత మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిసెంబర్లో శాసనసభకు ఉప ఎన్నికలు వస్తాయని, జనవరిలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అంటున్నారు.
రాష్ట్రంలో 18 శానససభ స్థానాలకు, ఒక లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. పది రోజుల్లో వీటి షెడ్యూల్ను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జూన్లో లేదా ఆగస్టులో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నిక జరిగిన తర్వాత ఆగస్టులో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తుండగా, సాధ్యమైనంత త్వరగా ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు ఉత్సాహం ప్రదర్శిస్తోంది.
మధ్యంతర ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే, ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మాత్రమే తప్పకుండా మలుపు తిప్పే అవకాశం ఉంది. కాంగ్రెసు పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకుంటే మాత్రమే పరిస్థితి యధాతథంగా ఉంటుంది. కాంగ్రెసు పార్టీలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెసు ఓడిపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికే కాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కూడా కష్టాలు ఎదురవుతాయి. పార్టీ అధిష్ఠానం తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
వైయస్ జగన్ ఆలోచన మరో విధంగా ఉంది. తాము మెజారిటీ సీట్లు గెలిస్తే కాంగ్రెసు శాసనసభ్యులు తన వైపు బారులు తీరుతారని ఆయన అనుకుంటున్నారు. కాకపోతే కాంగ్రెసు పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ప్రభుత్వం కూలిపోతుందని ఆయన అనుకుంటున్నారు. అదే జరిగితే కాంగ్రెసు ప్రభుత్వం ఏమో గానీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగించడం కష్టమే అవుతుంది.












Click it and Unblock the Notifications