రంగంలోకి సోనియా: హైదరాబాద్కు వాయలార్ రవి

వాయలార్ రవి మూడు రోజుల పాటు హైదరాబాదులో ఉంటారు. తాను అధిష్టానం ఆదేశం మేరకే వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇక్కడి పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇస్తానని ఆయన చెప్పారు. పార్టీ అసంతృప్తి ఉందనేది మీడియా సృష్టేనని ఆయన అన్నారు. పార్టీ నాయకులంతా కలిసికట్టుగానే ఉన్నారని ఆయన అన్నారు. అయితే, సోనియా గాంధీ మాత్రం పార్టీ పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురువుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనడానికి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ సోమవారం ఢిల్లీలో ఉన్నారు.
ఇంతకు ముందు ఎఐసిసి కార్యదర్శి కృష్ణమూర్తి హైదరాబాదుకు వచ్చి పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక సమర్పించారు. దాంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పిలిపించి ఆజాద్ క్లాస్ తీసుకున్నారు. వారిని కలుసుకోవడానికి కూడా సోనియా గాంధీ ఇష్టపడలేదు. ఆ ముగ్గురు నాయకులకు సర్దిచెప్పినా ఫలితం కనిపించడం లేదనే అభిప్రాయానికి సోనియా వచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని గాడిలో పెట్టాలని అధిష్టానం ప్రయత్నిస్తోంది. కనీసం సగం స్థానాలైనా గెలుచుకోవాలని అధిష్టానం ముగ్గురు నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, వారిపై నమ్మకం లేకనే వాయలార్ రవిని సోనియా హైదరాబాద్ పంపించినట్లు తెలుస్తోంది. ఆయన మూడు రోజుల పాటు నాయకులు, మంత్రులు, శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకుని నివేదినకు రూపొందించి సోనియా గాంధీకి సమర్పిస్తారని తెలుస్తోంది.
వాయలార్ రవి గతంలో పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షించారు. తనకు రాష్ట్ర నాయకులతో మంచి సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. ఆజాద్కు రాష్ట్ర నాయకులతో మంచి సంబంధాలుండడమే కాకుండా పరిస్థితులను చక్కదిద్దడంలో నైపుణ్యం ప్రదర్శించగలరనే అభిప్రాయం ఉంది. ఆ నమ్మకంతోనే మరోసారి ఆజాద్ను రాష్ట్ర వ్యవహారాలు అప్పగించారు. అయితే, ఆజాద్ కూడా పార్టీ పరిస్థితులను చక్కదిద్దడానికి సరిపోవడం లేదు. దీంతో సోనియా తానే చేయి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications