పదవులు ఉంటాయి, పోతాయి: జగన్, సిఎంకు కౌంటర్

ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు ఎవరి కారణంగా వచ్చాయో ప్రజలు ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థపరుల వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని సిఎం ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమం కోసం తమ పదవులను త్యాగం చేశారని అన్నారు.
రాష్ట్రంలో రైతులు పడుతున్న అవస్థలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీలో ఉన్న వారు పదవులు వదులుకోవడానికి ఇష్టపడరని, పేదలు రైతుల కోసం ఆ పని చేయాలంటే వారికి మనసు రాదని, కానీ రైతుల కోసం ఏకంగా ఎమ్మెల్యే పదవినే తృణపాయంగా తన వర్గం నేతలు వదిలేశారన్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ మకు నచ్చని వారిపై కేసులు పెడుతున్నారన్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం కుమ్మక్కై వైయస్సార్ కాంగ్రెసును మట్టుపెట్టాలని చూస్తున్నాయని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్సుమెంట్స్ తదితర పథకాలకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు అధికార పార్టీలకు కనువిప్పు కలగాలన్నారు.
రైతు సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిజాయతీపరులైన వైయస్సార్సీ అభ్యర్థులకు ఓట్లు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉదయం సారవకోట మండలం కుమ్మరిగుంట గ్రామం నుంచి జగన్ రోడ్షో ప్రారంభమైంది. అక్కడ నుంచి బొంతు జంక్షన్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నారాయణపురంలో రోడ్షో నిర్వహించారు. అక్కడ ఉపాధి హామీ కూలీలతో జగన్ మాట్లాడారు. ఆ తరువాత దండులక్ష్మీపురం, దాసుపురం, నౌతళ జంక్షన్, నారాయణపురం, పెద్దలంబ, వాండ్రాయి, పెదగుజ్జువాడ, చినగుజ్జువాడ, సారవకోటల్లో ప్రజలతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications