రాజ్యసభకు భారత కెప్టెన్ ధోనీ: జెవిఎం ప్రతిపాదన

జార్ఖండ్ నుంచి రెండు స్థానాలకు మే 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఓట్లను కొనుగోలు చేసే ఆరోపణలు రావడంతో మార్చి 30వ తేదీన రాజ్యసభకు జరిగిన ఎన్నికలు రద్దయ్యాయి. రాంచీలోని ఓ కారు నుంచి 2.15 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ ఆరోపణలు వచ్చి ఎన్నికలు రద్దయ్యాయి. జెవిఎం ధోనీని రాజ్యసభకు పంపే విషయంలో సీరియస్గానే ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్ నాయకత్వం వహించి ప్రపంచ కప్ను తెచ్చిపెట్టిన ధోనీని రాజ్యసభకు ఎందుకు పంపించకూడదని, ధోనీ రాంచీ పుత్రుడని జెవిఎం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సమరేష్ సింగ్ అన్నారు. మరో అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ డిజిపి, నిజాయితీ గల అధికారి నియాజ్ అహ్మద్ను ఎంపిక చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. సమరేష్ సింగ్ ప్రతిపాదనను బాబూలాల్ మరాండీ సీరియస్గానే తీసుకున్నట్లు తెలుస్తోంది.
వోట్ల కొనుగోలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరాండీ ఇసికి లేఖ రాశారు. అదే సమయంలో జార్ఖండ్ భూమి పుత్రుడిని, రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపించడానికి సహకరించాలని కోరుతూ ఆయన సోనియా గాంధీకి కూడా ఆదివారంనాడు లేఖ రాశారు. మరాండీ లేఖ సమర్ సింగ్ ప్రతిపాదించిన తర్వాతనే జరిగింది. అయితే, ఆ ప్రతిపాదనను పార్టీ కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ధోనీతో ఆ విషయాన్ని జెవిఎం సూచనప్రాయంగా తెలియజేసినట్లు కూడా చెబుతున్నారు. ఆ విషయంపై తాను ఆలోచిస్తానని ధోనీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెసుకు, జెవిఎంకు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. కాంగ్రెసు ప్రతిపాదించే వ్యక్తిని రాజ్యసభకు తాము బలపరిచేది లేదని సమర్ సింగ్ చెప్పారు. పాలక జెఎంఎం, బిజెపి పక్షాలు తమ అభ్యర్థిపై చర్చలు జరిపాయి.












Click it and Unblock the Notifications