వైయస్పై మరో ఆస్త్రం: బిసి వ్యతిరేకిగా సారయ్య వ్యాఖ్య
తెలంగాణ సమావేశం పెట్టాలని చూస్తే తనను ఫోన్లో వైయస్ రాజశేఖర రెడ్డి బెదిరించారని బస్వరాజు సారయ్య ఇంతకు ముందు చెప్పారు. ఆ రకంగా ఆయనను తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ఆయన ప్రయత్నించారు. వరంగల్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు కొండా సురేఖతో బస్వరాజు సారయ్యకు సుదీర్ఘ వైరం ఉంది. వైయస్ రాజశేఖరరెడ్డి వరంగల్ జిల్లాలో సురేఖను ప్రోత్సహించారు. పైగా, పరకాల ఉపఎన్నికల్లో సురేఖను ఎదుర్కోవడానికి సారయ్య వైయస్సార్ను తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించారని చెబుతున్నారు.
అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను దెబ్బ తీయడానికి, వైయస్సార్ సెంటిమెంటు జగన్కు ఉపయోగపడకుండా చేయడానికి కాంగ్రెసు వ్యూహాత్మకంగానే పద్ధతి ప్రకారం వైయస్పై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. సమాజంలోని వివిధ వర్గాల్లో వైయస్ సెంటిమెంటును తుడిచివేసే ప్రయత్నంలో భాగంగానే అలా జరుగుతున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ వంటి కాంగ్రెసులోని దళిత నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డి దళితులకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల దళితులకు అన్యాయం జరిగిందని కూడా అంటున్నారు. మరోవైపు, వైయస్ జగన్ అవినీతిలో వైయస్ రాజశేఖర రెడ్డికి పాత్ర ఉందని, జగన్ అవినీతిని విమర్శిస్తూ వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్సించకుండా ఉండలేమని సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. వివిధ కోణాల నుంచి వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి వంటి రాష్ట్ర మంత్రులు మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డి తమ కాంగ్రెసు నాయకుడేనని అంటున్నారు. కేంద్ర ప్రతినిధి వాయలార్ రవి కూడా వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుకూలంగానే మాట్లాడారు. వైయస్ సంక్షేమ పథకాలు కాంగ్రెసు పథకాలేనని చెప్పుకోవడానికి వీరు ఇలా మాట్లాడుతున్నారని, మరో వైపు వివిధ వర్గాల్లో వైయస్పై వ్యతిరేకత పెరగడానికి ఆయన వర్గాల నాయకులతో వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు.