వైయస్ నిజంగా రైతు వ్యతిరేకేనేమే!?: జగన్ కౌంటర్
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైన కాంగ్రెసు వైయస్ పైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. దళితులు, రైతులు అందరీకి సరియైన న్యాయం చేసింది వైయస్సే అన్నారు. టిడిపి, కాంగ్రెసులు కుమ్మక్కై ఆర్టీఐ కమిషనర్ల పదవులు పంచుకున్నాయని మండిపడ్డారు. ఎమ్మార్ విషయంలో చంద్రబాబును సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు.
మరణించినా ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోవాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను గాలి కొదిలేస్తున్నారని ఆయన కొయ్యలగూడెం ప్రచారంలో కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. వైయస్ మృతి చెంది రెండేళ్లు దాటినా ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు కాంగ్రెసు పెద్దలు చేస్తున్నారని విమర్శించారు.
వైయస్ను తిట్టేందుకు కేబినెట్ భేటీ కూడా పెట్టుకోవడం చూస్తుంటే చాలా బాధేస్తుందన్నారు. వైయస్ ఎలాగూ తిరిగి వచ్చి సమాధానం చెప్పలేరన్న ధైర్యంతో కాంగ్రెసు, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వారు చెప్పినట్లు వైయస్ నిజంగానే రైతు వ్యతిరేకేనేమో అందుకే వరికి మద్దతు ధర పెంచాలని ఆయన తపించారని ఎద్దేవా చేశారు.
తాను ముఖ్యమంత్రి అయి కాగానే వరికి మద్దతు ధరను ఏకంగా దాదాపు రెండింతలు చేశారన్నారు. సిఎం అయిన తొలినాడే రైతుల కోసం విద్యుత్ బకాయిలు మాఫీ చేశారన్నారు. అటువంటి వైయస్ను రైతు వ్యతిరేకి అనడం శోచనీయం అన్నారు. పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తే వైయస్సే గుర్తుకు వస్తాడన్నారు. పైనున్న దేవుడు చూస్తున్నాడని కాంగ్రెసు, టిడిపిలకు ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోతోనే తాము ఉప ఎన్నికలకు వెళతామని మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్లో చెప్పారు. ప్యాన్ గుర్తుతోనే ఎన్నికలకు వెళతామని చెప్పారు. ప్రతి ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తోందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ పేరుతో టిఆర్ఎస్ పబ్బం గడుపుకుంటోందని కొండా సురేఖ ఆరోపించారు.