మంగళి కృష్ణ నిందితుడే: సూట్కేస్ బాంబ్ కేసులో కోర్టు
ఈ కేసులో మంగళి కృష్ణ బుధవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ అనుచరులు అక్కడకు భారీగా తరలి వచ్చారు. దీంతో కోర్టు వద్ద, అనంతపురంలో భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బుధవారం తుది తీర్పు కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో అనంతలో హైటెన్షన్ ఏర్పడింది.
కాగా 2001లో మాజీ మంత్రి, దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవిని చంపేందుకు సూటు కేసు బాంబు ప్రయోగించారని మంగళి కృష్ణపై అభియోగం. ఇన్నాళ్లుగా ఈ కేసు నడిచింది. కేసులో వాదనలు విన్న కోర్టు బుధవారం అంతిమ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 14మందిని నిందితులుగా పేర్కొన్నారు.
విచారణ సమయంలోనే నలుగురు నిందితులు మృతి చెందారు. మరో ఆరుగురిపై సాక్ష్యాధారాలు లేనందున వారి పేర్లు కొట్టి వేసింది. మిగిలిన నలుగురికి శిక్ష పడింది. నిందితుల్లో మంగళి కృష్ణతో పాటు రాంచంద్రా రెడ్డి, మధుసూధన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా నిందితులకు శిక్షను మరికాసేపట్లో కోర్టు ఖరారు చేయనుంది.