వంశీకి నోటీసు వెనక బాలకృష్ణ, జూ ఎన్టీఆర్పై గుర్రు

షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడానికి కేవలం 48 గంటల వ్యవధి మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు పంపించివేయాలని బాలకృష్ణ చంద్రబాబుకు సూచించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. వంశీని ఎంత మాత్రం పార్టీలో కొనసాగించకూడదని, పార్టీ కన్నా పెద్దలమని భావించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జూనియర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదని బాలయ్య చంద్రబాబుతో అన్నట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తీరుపై బాలకృష్ణ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, దమ్ము సినిమా విడుదల రోజునే తెలుగుదేశం పార్టీ అఖిపక్షాలతో కలిసి కృష్ణ జిల్లా బంద్కు పిలుపునివ్వడంపై జూనియర్ ఎన్టీఆర్ మండిపోతున్నట్లు చెబుతున్నారు. బందరు పోర్టు సాధన పేరుతో అఖిలపక్షం ఈ నెల 27వ తేదీన కృష్ణా జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. దీంతో గుడివాడలో మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో దమ్ము ఉదయం పూట షో వేయలేదు.
గుడివాడ శానససభ్యుడు కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్కు సన్నిహితుడు కావడం వల్ల అక్కడ సినిమా ప్రదర్శనకు ఆటంకం కలగలేదు. దమ్ము సినిమా విడుదల ఉన్నందున బంద్ను వాయిదా వేయాలని వంశీ, కొడాలి నాని కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావును కోరినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు దేవినేని ఉమ అంగీకరించలేదని అంటున్నారు.
దమ్ము సినిమా విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలపై జూనియర్ ఎన్టీఆర్, వంశీ మధ్య సుదీర్ఘ మంతనాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే జగన్ను అందరూ చూస్తుండగా పలకరించాలని జూనియర్ ఎన్టీఆర్ వంశీకి సూచించినట్లు చెబుతున్నారు. దాంతోనే వంశీ జగన్ను విజయవాడ నడిరోడ్డుపై కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలోని పలువురు నాయకులు జగన్ వైపు చూస్తుండడం పట్ల కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో గుబులు ప్రారంభమైనట్లు చెబుతున్నారు. తెలుగదేశం పార్టీలోనే కాకుండా అధికార కాంగ్రెసు పార్టీలో కూడా జగన్ చిచ్చు పెట్టారు.












Click it and Unblock the Notifications