Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరుకు తన చరిష్మాపై అతివిశ్వాసం: హరిరామజోగయ్య

Harirama Jogaiah
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తన చరిష్మాను ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు చేగొండి హరిరామజోగయ్య ఆదివారం విమర్శించారు. తిరుపతి, నరసాపురం, రామచంద్రాపురం, పాయకరావుపేట, ఆళ్లగడ్డ నియోజకవర్గాలలో కాంగ్రెసు అభ్యర్థుల గెలుపు ఓటములకు తానే బాధ్యత వహిస్తాననడం ఆయన అవివేకానికి నిదర్సనమన్నారు. స్వతహాగా చిరంజీవి మంచివాడే అయినా చిరుకు ఏ మాత్రం రాజకీయ చతురత లేదన్నారు.

ఆ ఐదు నియోజకవర్గాల ఓటమి బాధ్యత కూడా తనపై వేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలాంటి ప్రకటనతో ఆయన మున్ముందు కాంగ్రెసులో కష్టాలు తెచ్చుకుంటారని అభిప్రాయపడ్డారు. నిజంగా చిరంజీవికి అంత ఆకర్షణే ఉంటే 2009 ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఇంటింటికి, వీధివీధికి వెళ్లి ప్రచారం చేసినా ఎందుకు నెగ్గలేదని ప్రశ్నించారు.

కనీసం తన సామాజికవర్గం ఓట్లనైనా అరవై శాతం మేరకు వేయించుకొని ఉంటే 2009 ఎన్నికలలో అదనంగా మరో 20 సీట్లు వచ్చి ఉండేన్నారు. ఇటీవల జరిగిన కొవూరు ఉప ఎన్నికలలో చిరంజీవి మూడు రోజులు ప్రచారం చేసినా కాంగ్రెసుకు మూడో స్థానమే దక్కిందని గుర్తు చేశారు. పిఆర్పీ పెట్టి తన సామాజికవర్గాన్ని చిరు నాశనం చేశారని, ఇంకా తన వర్గం తన వెంటే ఉందని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

తన సామాజికవర్గం నాయకులు ఒకరి తర్వాత మరొకరుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న విషయం చిరంజీవి గ్రహించక పోవడం దురదృష్టకరమన్నారు. ఆయనను నమ్మి ఓట్లు వేసిన డైబ్బై లక్షల మందిని నట్టేట ముంచారని, ఎన్నికల హామీలు తుంగలో తొక్కి, కేంద్రంలో ఒక మంత్రి పదవి, ఒకరిద్దరు నేతలకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు దక్కించుకోవడమే ధ్యేయంగా పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడం దగా అన్నారు.

చిరుకు ఓట్లేసిన వారిలో అత్యధికులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంకితమైపోయారన్న సంగతి ఇంకా ఆయనకు తెలియనట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తున్నదనే విషయం కూడా చిరంజీవి గుర్తించడం లేదన్నారు. చిరు బాధ్యత వహిస్తానన్న ఐదు నియోజకవర్గాలలో కూడా భారీ మెజార్టీతో వైయస్సార్ కాంగ్రెసు గెలవబోతుందన్నారు.

చిరంజీవి నిజజీవితంలోనూ మంచి నటుడినని నిరూపించుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు నేత జ్యోతుల నెహ్రూ తూర్పు గోదావరి జిల్లాలో మండిపడ్డారు. జగన్‌కు, ఆయనకు నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పదవులు, ప్రమోషన్ల కోసమే ప్రజారాజ్యంను కాంగ్రెసులో చిరంజీవి విలీనం చేశారని ఆరోపించారు. కాంగ్రెసు వారి పంచెలు ఊడగొడతామన్న పంచ్ డైలాగులు మరిచిపోయారా అని ప్రశ్నించారు.

వైయస్ చనిపోయినప్పుడు జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని ఆయన వద్దకు ఎవరొచ్చారో చెప్పాలన్నారు. ఆయనకు దమ్ముంటే తిరుపతిలో బావమరిది అల్లు అరవింద్‌ను గాని, సోదరుడు పవన్ కల్యాణ్‌ను గాని పోటీ చేయించి గెలుపించుకోవాలని సవాల్ విసిరారు. జగన్‌తో పెట్టుకోకుండా రాజకీయ జీవితం సాగించాలని, లేకుంటే చాలా విషయాలు మాట్లాడవలసి వస్తుందని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+