మంగళి కృష్ణతో కలిసి చాలా దందాలు చేశా: భానుకిరణ్
బెంగళూరుకు చెందిన ఈశ్వర శర్మ అనే వ్యకికి చెందిన 60 ఎకరాల భూమిని పులివెందుల కృష్ణతో కలిసి సెటిల్ చేశానని భాను కిరణ్ అందులో పేర్కొన్నాడు. హంద్రీనీవా ప్రాజెక్టు పనుల్లో కెవిఎన్ రెడ్డికి కాంట్రాక్టు దక్కేలా కృష్ణ , మధుమోహన్తో కలిసి కొందరిని బెదిరించి సెటిల్ చేశానని పేర్కొన్నాడు. 2006లో తనను సినీ నిర్మాత శివ రామకృష్ణ కలిశాడని, ఏడెకరాల భూవివాదాన్ని పరిష్కరించి కోటి రూపాయలు తీసుకున్న కృష్ణ తనకు కేవలం రూ20 లక్షలు మాత్రమే ఇచ్చారని వివరించాడు.
2009లో విష్ణువర్ధన్, డాక్టర్ శరత్ అనే ఇద్దరు తనను కలిశారని, కరీంనగర్లో వంగ సుధీర్ రెడ్డికి చెందిన భూమి ఆక్రమించుకున్నామని వెల్లడించాడు. అందులో 5.25ఎకరాల భూమి తన పేరిట, 4.25 ఎకరాల భూమి సూరి సోదరి హేమలతా రెడ్డి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు వివరించాడు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో సెటిల్మెంట్లు చేసినట్లు చెప్పాడు.
2010 డిసెంబర్లో రక్తచరిత్ర-2 సినిమాను సి కల్యాణ్తో పాటు రాప్తాడు నియోజకవర్గంలోని ప్రజలకు బెంగళూరుకు తీసుకెళ్లి ప్రివ్యూ చూపించానని సిఐడి కస్టడీలో భాను అంగీకరించాడు. సూరిని హత్యచేసే ముందు శింగనమల రమేష్తో కలిసి శంషాబాద్లో ఒకసారి, గురుకుల ట్రస్ట్ భవన్లో మరోసారి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశానని దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. సూరిహత్య తర్వాత మధుసూధన్కు ఫోను చేసి అవసరమైన డబ్బు తెప్పించుకున్నానని భాను సిఐడి అధికారుల ముందు గుట్టువిప్పాడు.
ఆర్థిక, భూవివాదాలలో తలదూర్చి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నానని 2010 సెప్టెంబరులో మంగళి కృష్ణ సూచనల మేరకు కొందరు తనకు వ్యతిరేకంగా సూరికి ఫిర్యాదు చేశారని తెలిపాడు. తన ప్రమేయం లేకుండానే పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేయడంపై సూరి తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పాడు. పరిటాల రవి హత్య కేసు నుండి బయటపడిన వెంటనే తనను హతమారుస్తానని హెచ్చరించాడని చెప్పాడు.
దీంతో సూరిని హత్య చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు. తన సోదరుడు వంశీని కూడా హత్య చేస్తానని చెప్పాడని, 2010 నవంబరులోనే డ్రైవర్, వ్యక్తిగత గన్మెన్తో కలిసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లి దారిలో ఆయుధాన్ని పరీక్షించానని చెప్పాడు. అది కేవలం మూడు రౌండ్లు మాత్రమే పని చేసిందని, మిగిలినవి సరిగా ఫైర్ కాలేదని వివరించాడు. ఆ తర్వాత కూడా టెస్ట్ ఫైర్ చేశానని నేరాంగీకార పత్రంలో భాను తెలిపాడు. అనంతలో తాను ఓ పోలీస్ అధికారి ద్వారా పాస్ పోర్టు సంపాదించుకున్నట్లు చెప్పారు.
సూరి బెదిరింపులు ఎక్కువ కావడంతో తప్పని పరిస్థితుల్లో అతనిని చంపానని, ఆ తర్వాత పూణేకు, అటు నుండి ముంబయికి వెళ్లినట్లు చెప్పాడు. తాను దాదర్లో తీస్మార్కాన్ సినిమా చూశానని భాను విచారణలో వెల్లడించారు. ఆ తర్వాత పలు ప్రాంతాలలో తిరిగినట్లు చెప్పాడు. ఆ తర్వాత డబ్బులకు ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ వస్తున్న సమయంలో పోలీసులు తనను జహీరాబాద్ వద్ద అరెస్టు చేశారని చెప్పాడు.