వైయస్ జగన్పై కాంగ్రెసు పోరు: తెరపైకి మళ్లీ కెవిపి

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పుకుని ఆయన క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. ఇటీవలి కాలంలో మాత్రం ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు విందు ఇచ్చారు. లోధీరోడ్లో ఉన్న తన నివాసంలో ఇలా పార్లమెంటు సభ్యుకు విందు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ విందుకు తెలంగాణ ఎంపీలు కూడా హాజరుకావడం మరో విశేషం.
రాజ్యసభలో బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై పార్టీ తరఫున మాట్లాడాల్సిందిగా పార్టీ చీఫ్ విప్ నాచియప్పన్ స్వయంగా కెవిపిని కోరారు. తన సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్తో కలిసి కెవిపి పార్లమెంట్లో ఒక అధికారి గదిలో ఈ ప్రసంగ పాఠాన్ని రూపొందించుకున్నారు. తెలంగాణ డిమాండ్లో న్యాయం లేదన్న కెవిపిని ఒక్క మధు యాష్కీ మినహా మిగిలిన తెలంగాణ పార్లమెంటు సభ్యులు గట్టిగా విమర్శించలేదు.
ఉప ఎన్నికల తర్వాత వైయస్ జగన్ పార్టీలోకి పెద్ద యెత్తున వలసలు ఉంటాయని భావిస్తున్నారు. ఒక వేళ అటువంటి పరిస్థితే వస్తే ఆపడం కేవలం కెవిపి రామచందర్ రావు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అధిష్టానం యోచన అంతగా ఫలించే అవకాశం లేదని, మొదట్లోనే ఆ పని చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications