కుదిరితే..: తనయుడి కోసం జగన్ పార్టీలోకి ఉమ్మారెడ్డి?
ఉమ్మారెడ్డి ప్రతిపాదనలకు జగన్ పార్టీ ఓకె చెబితే ఆయన ఏ క్షణంలోనైనా వైయస్సార్ కాంగ్రెసులో చేరే అవకాశముంది. ఈ కారణం వల్లనే ఉమ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తనకు ప్రాథమిక సభ్యత్వమే ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యలపై టిడిపిలో చర్చ జరుగుతోంది.
పార్టీలో అత్యున్నతమైన పోలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉండి అందరి సభ్యత్వాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదని పార్టీ నేతలు అంటున్నారు. ఆయన ఉద్దేశ్య పూర్వకంగానే పార్టీ పైన విమర్శలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మారెడ్డి ఇటీవల పార్టీ పైన తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పార్టీలో కాపులకు సరైన ప్రాధాన్యం లేదని ఆయన వాపోయారు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి కూడా హాజరు కాలేదు. తనకు పార్టీ సభ్యత్వమే లేనప్పుడు సమావేశానికి ఎలా వెళతానని అన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలవాల్సి ఉన్నప్పటికీ ఆయన కలవలేదు.
అదే సమయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అతనిని కలవడం చర్చనీయాంశమైంది. ఉమ్మారెడ్డి వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్లనున్నారా లేక కాంగ్రెసు లోనికి వెళ్లనున్నారా అనే చర్చ జరిగింది. అయిత తమ భేటీ మధ్య ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని ఇరువర్గాలు కొట్టి పారేశాయి. పరిచయం నేపథ్యంలోనే కలుసుకున్నట్లు చెప్పారు.