ముందే ఊహించాం: మీడియా ఖాతాల స్తంభనపై జగన్

YS Jagan
హైదరాబాద్: తన మీడియా సంస్థల బ్యాంక్ ఖాతాల స్తంభనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్పందించారు. ఏదో ఒక రోజు సిబిఐ ఈ పని చేస్తుందని తాము ముందే ఊహించామని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ ఖాతాల స్తంభనపై ప్రతిస్పందించారు. సాక్షికి సంబంధించిన సంస్థల బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలతో సాక్షి మీడియాను నిరోధించలేరని ఆయన అన్నారు.

జనం మీడియాగా సాక్షి ఏనాడో ఆదరణ పొందిందని ఆయన అన్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన విమర్శించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవి9 రాసేవి, చూపేవే వార్తలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు, చంద్రబాబు తప్ప మూడో వారు ఉండకూడదన్నది వారి ఉద్దేశమని ఆయన అన్నారు. తనను ఎదుర్కోలేకనే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు.

తమకు సిబిఐ నుంచి ఎటువంటి నోటీసులూ అందలేదని సాక్షి మీడియా యాజమాన్యం వ్యాఖ్యానించింది. ఖాతాల స్తంభనపై న్యాయపోరాటం చేస్తామని చెప్పింది. సాక్షి సంస్థల బ్యాంకు ఖాతాలను సిబిఐ నిలిపేయడాన్ని పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి అభివర్ణించారు. గతంలోనూ ఇలాంటివి జరిగినా చివరకు పత్రికా స్వేచ్ఛే గెలిచిందని ఆయన అన్నారు.

పత్రికా స్వేచ్ఛను దెబ్బ తీసే ఏ శక్తితోనైనా సాక్షి పోరాడుతుందని ఆయన అన్నారు. పత్రికా స్వేచ్ఛపై పరోక్షంగానే దాడి ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ఖాతాల స్తంభనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సంప్రదిస్తామని ఆయన చెప్పారు. సాక్షిని ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. సాక్షి ఏజెంట్లు, ఉద్యోగులు, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. పత్రికా ప్రచురణ యథాతథంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు.

ఖాతాలను స్తంభింపజేసినంత మాత్రాన పత్రికా స్వేచ్ఛను హరించడం కాదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పత్రికా స్వేచ్చను జగన్ స్వార్థం కోసం వాడుకున్నారని ఆయన విమర్శించారు. ఖాతాలను సిబిఐ స్తంభింపజేయడం నూటికి నూరు శాతం కరెక్టేనని ఆయన అన్నారు. ప్రజల సొమ్మును హరించి జగన్ మీడియాను స్థాపించారని ఆయన అన్నారు. సిబిఐ ఈ పనిని ఎప్పుడో చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆయన అన్నారు. జగన్ ఆస్తుల కేసుల విషయంలో ఈ చర్యలు సరిపోవని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. దీన్ని ఆసరా చేసుకుని జగన్ రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని ఆయన అన్నారు.

చట్టం తన పని తాను చేస్తోందని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెసుకు గానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ ఇందులో సంబంధం లేదని ఆయన అన్నారు. సత్యం రామలింగరాజు కేసులోనూ, 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో గానీ ఇలాగే జరిగిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+