నేను అలా ఆలోచిస్తే..: చంద్రబాబు, జగన్ అరెస్టుపై ప్రశ్న
కాంగ్రెసు పార్టీ దొంగల పార్టీ అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గజదొంగల పార్టీ అని విమర్శించారు. మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీయే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, ముఠాలు లేవన్నారు. అలాంటి వారు రాష్ట్రం విడిచి వెళ్లి పోయారన్నారు. కానీ కాంగ్రెసు పార్టీ హయాంలో వారిదే రాజ్యం అన్నారు. వారిలా తాను అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించలేదన్నారు.
టిడిపి ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేస్తుందన్నారు. అవినీతి, రౌడీలు, దుర్మార్గాల వల్ల రాష్ట్రం ఇప్పటి వరకు ఎంతో నష్ట పోయిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. వ్యవసాయం లాభసాటిగా వచ్చే వరకు రైతుల తరఫున టిడిపి పోరాటం చేస్తుందని చెప్పారు. కాంగ్రెసు నేతలు రాష్ట్రాన్ని పూర్తిగా లూఠీ చేశారన్నారు. వచ్చే ఎన్నికలలో కాపులకు మరింత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్తో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తనయుడికి సంబంధాలు ఉన్నాయంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. అక్రమాస్తుల కేసులో మొదటి రెండు ఛార్జీషీటులతో పాటు మూడో ఛార్జీషీటులోనూ జగనే తొలి ముద్దాయి అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అవినీతి సొమ్ముతో సినిమాలు తీస్తున్నారని ఆరోపించారు.
ఉప ఎన్నికలు రావడానికి కారణం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే కారణమని పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
జగన్ను కేంద్రమంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు రక్షిస్తున్నారని హైదరాబాదులో దేవినేని ఉమామహేశ్వర రావు, దుర్గా ప్రసాద్, లింగా రెడ్డిలు ఆరోపించారు. జగన్ పైన మూడు ఛార్జీషీట్లు జారీ చేసిన తర్వాత కూడా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన వారు ప్రశ్నించారు. జగన్ను కాపాడేందుకు కేంద్రం విశ్వ ప్రయత్నం చేస్తోందన్నారు. ఇందుకోసం కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఒక సామాన్యుడు సైకిల్ దొంగతనం చేస్తే నడిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకు వెళ్లి లాకప్ డెత్ చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. సామాన్యుడికి ఓ న్యాయం, లక్ష కోట్లు దోచుకున్న జగన్కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు జగన్ డెబ్బై గదుల ఇల్లు సిఎంకు ఈ రోజు కనిపించిందా అని ప్రశ్నించారు.