భూ వివాదంలో మంత్రి పార్థసారథి, దేవినేని ఉమ ఫైర్

మంగళవారం ఉదయం పార్థసారథికి చెందిన వ్యక్తులు ఆ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. ఆ భూమి తనదంటూ శ్రీరామమూర్తి అడ్డుకున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మంత్రి కూడా ఆ భూమిని తాను ఓ వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. ఆ నాలుగు ఎకరాల భూమి తనదే అని మంత్రి చెబుతున్నారు.
అయితే వివాదాస్పద భూమిని సదరు వ్యక్తి మంత్రికి అమ్మినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ భూమిని మంత్రి తన కుమారుడి పేరిట కొనుగోలు చేశారు. మంత్రి కూడా అది తన భూమే అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని రూ.కోటి ముప్పై ఐదు లక్షలకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఆ భూమి వివాదాస్పదమైంతే కాకుండా జాతీయ రహదారికి దగ్గరలో ఉండటం, విలువైన భూమి కావడంతో ఇది వివాదం అయి కూర్చుంది. తాను అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతనే భూమిని కొన్నానని, అవసరమైతే తాను స్థలాన్ని వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, కోర్టు ద్వారా న్యాయం తేల్చుకోవాలని పార్థసారథి చెబుతున్నారు. అనవసరంగా దీనిని వివాదం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా పార్థసారథి భూ వివాదంపై హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్థసారథి కొడుకు పేరిట రైతుల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జాకు పాల్పడ్డ పార్థసారథిని వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.
బాధితులు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. గూండాలు, పోలీసుల సహాయంతో కబ్జా చేసిన భూమికి ఫెన్సింగ్ వేసుకునే ప్రయత్నాలను పార్థసారథి చేశారని ఆరోపించారు. రైతుల భూమిని కబ్జా చేసిన మంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications