జగన్ క్రిమినల్ లింక్స్పైనే కాంగ్రెసు అటాక్
జగన్ అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వైయస్ రాజశేఖర రెడ్డిని సొంత చేసుకోవాలా, వద్దా అనే మీమాంసలో ఉన్న కాంగ్రెసు అందుకు సిద్ధంగా లేదు. కాంగ్రెసులోని వి. హనుమంతరావు వంటి కొద్ది మంది నేతలు వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి గురించి కూడా మాట్లాడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రమేయం లేకుండా జగన్ అవినీతికి పాల్పడే అవకాశం లేదనేది కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, వి. హనుమంతరావు వంటి నాయకుల మాట. అయితే, కాంగ్రెసులోని చాలా మంది వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడానికి సిద్ధంగా లేకపోవడమే కాకుండా అలా చేయడాన్ని తప్పు పడుతున్నారు కూడా.
ఇక రెండో విషయానికి వస్తే - జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తే ఏ రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడలేదనే ప్రశ్ననే ప్రజల నుంచి వస్తోంది. అవినీతికి పాల్పడడంలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనేదే తప్ప అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుడు ఉండదనేది ప్రజల్లో నాటుకున్న విషయం. అందువల్ల జగన్ అవినీతి గురించి మాట్లాడితే ఫలితం ఉండదనేది కాంగ్రెసు నాయకులు భావిస్తూ ఉండాలి.
కాగా, జగన్పై మెతక వైఖరి అవలంబిస్తున్నారనే ముద్రను తొలగించడానికో, ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశమో గానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్పై మాటల దాడిని పెంచారు. జగన్ అత్యంత ఆధునికమైన, 80 గదుల ఇల్లు గురించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మొదటి నుంచి జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలే చేస్తున్నారు గానీ వైయస్ రాజశేఖర రెడ్డిపై మాట్లాడడం లేదు.
కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిటాల రవి హత్యకు, సూరి హత్యకు, భాను కిరణ్ వ్యవహారాలకు, మంగలి కృష్ణ వ్యవహారాలకు సంబంధాలు అంటగడుతూ వైయస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. జగన్ అవినీతి గురించి కూడా ధారాళంగా మాట్లాడుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలోని అవినీతి గురించి ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు.