వేల మంది ఆధారపడ్డారు, ఖాతాలు తెరిపించండి: సాక్షి
తాము రూ.25 కోట్లు న్యూస్ ప్రింట్కు వినియోగిస్తున్నామని తెలిపింది. నెలకు రూ.8 కోట్ల జీతాలు చెల్లిస్తున్నామని, రూ.103 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, 14 లక్షల సర్క్యులేషన్ ఉందని తెలిపింది. ఈ సందర్భంగా సాక్షి టెలివిజన్, దిన పత్రికల నిర్వహణ, ఖర్చు, న్యూస్ ప్రింట్, ఉద్యోగుల జీతభత్యాలు తదితరుల పూర్తి వివరాలను పిటిషన్లో కోర్టుకు వివరించింది. స్తంభన ద్వారా ఉద్యోగులు జీవించే హక్కును కాలరాశాలని వారు ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధిక సర్య్కులేషన్ ఉన్న పత్రిక సాక్షియేనని చెప్పారు. సాక్షి వేసిన పిటిషన్ను స్వీకరించిన నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కాగా మంగళవారం సిబిఐ జగన్ మీడియా సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపివేసిన విషయం తెలిసిందే. సాక్షి దిన పత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్, సాక్షి టెలివిజన్ను నడిపే ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రా బ్యాంకు ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. సిఆర్పిసి 102 సెక్షన్ కింద సంక్రమించిన అధికారాలతో సిబిఐ ఆ ఖాతాలను స్తంభింపజేసింది.
కొత్త ఖాతాలను తెరిచి, కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని ఆ సంస్థలకు తెలిపింది. సాక్షికి సంబంధించి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) ఖాతాలను, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ఫ్రాకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఖాతాలను సిబిఐ స్తంభింపజేసింది. ఈ పరిణామం నేపథ్యంలో సాక్షి యాజమాన్యం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మరోవైపు బ్యాంక్ ఖాతాల స్తంభన విషయంలో అరుణ్ కుమార్ అనే న్యాయవాది హెచ్చార్సీని ఆశ్రయించారు. సిబిఐకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన హెచ్చార్సీ, వచ్చే నెల 6వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సాక్షి ప్రతినిధులు పలువురు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. సాక్షి ప్రతినిధులు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది.