వైయస్, కెవిపిల గురించి సూరీడు ఏం చెప్పాడు?
ఒకవేళ ఎవరైనా నేరుగా వైయస్ను కలిసినా ఆయన కెవిపితో మాట్లాడమని పంపేవారని సూరి తన వాంగ్మూలంలో వివరించాడు. రాజశేఖర రెడ్డి ఇంట్లో ఖర్చులకు అవసరమైన రూ.లక్షలను సునీర్ రెడ్డి తెచ్చి ఇచ్చేవాడని, ట్రైమెక్స్ ప్రసాద్ అనేకసార్లు దుబాయ్ నుంచి వచ్చి తెల్లవారుజామున వైయస్ను కలిసేవారని వెల్లడించాడని తెలుస్తోంది. 1977 నుంచి తాను వైయస్ మరణించే వరకు ఆయనతోనే ఉన్నానని చెప్పారని సమాచారం.
వైయస్కు కెవిపి ఆప్తమిత్రుడని, కెవిపి సలహా లేకుండా ఏ పనీ చేసే వారు కాదని, 2004లో వైయస్ సిఎం అయ్యాక ఆయన్ను సలహాదారుగా నియమించారని, ప్రభుత్వం ద్వారా ఎవరికైనా లబ్ధి జరగాలంటే మొదట కెవిపినే కలిసేవారని, వైయస్ ఇంటికి విఐపిలు, విదేశీ అతిథులు వచ్చినా ఆయన తప్పక ఉండేవారన్నారు. వైయస్ కుటుంబానికి ట్రైమెక్స్ ప్రసాద్ ఎప్పటి నుంచో పరిచయమని, రాజారెడ్డితో వ్యాపార సంబంధముండేదని, వైయస్ సిఎం అయ్యాక ప్రసాద్, కెవిపిలు పలుసార్లు కలిశారని ఆయన చెప్పారట.
నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, రాం ప్రసాద్ రెడ్డి, అయోధ్య రెడ్డి, నిత్యానంద రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, పొట్లూరి వరప్రసాద్, ఎకె దండమూడి, ఎన్ శ్రీనివాసన్, సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్థసారథి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు క్యాంప్ కార్యాలయానికి వచ్చే కలిసేవారని చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా జగన్ ఆస్తుల కేసులో వాంగ్మూలం ఇచ్చిన సూరీడును సిబిఐ అధికారులు బుధవారం మెజిస్ట్రీట్ ముందు హాజరు పర్చే అవకాశముంది. సూరీడు కీలక సమాచారాన్ని వెల్లడించడంతో ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు సూరిడు నుంచి వాంగ్మూలం తీసుకోవాలని సిబిఐ భావిస్తోంది. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి కూడా పొందింది. దిల్ కుషా గెస్టు హౌస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.