ఈనాడు, జ్యోతికి బెదురు: అంబటి, గొంతు కలిపిన గాదె!
ఉప ఎన్నికల తర్వాత తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నేతలకు దిమ్మ తిరుగుతుందన్నారు. సాక్షిని అణిచివేయాలనుకోవడం అప్రజాస్వామికం అన్నారు. ఆడిటర్ విజయ సాయి రెడ్డిపై పెట్టిన కేసులలో ఏమీ తప్పులు తేల్చలేక పోయిన విషయాన్ని అంబటి రాంబాబు చెప్పారు. వైయస్ జగన్ విషయంలో కూడా అదే నిర్ధారణ అవుతుందన్నారు.
ప్రభుత్వాలు బెదిరిస్తే పత్రికలు మూతపడవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. ప్రజాధరణతోనే పత్రికలకు మనుగడ ఉంటుందని చెప్పారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక బ్యాంక్ అకౌంట్ల ఖాతాలు స్తంభింప చేశారన్నారు. సాక్షిపై జరుగుతున్న దాడులను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.
జగన్ను ఉప ఎన్నికలలో అడ్డుకునేందుకే అకౌంట్ల స్తంభన అని గోనె ప్రకాశ్ రావు హైదరాబాదులో అన్నారు. వైయస్ జగన్ను లొంగదీసుకోవడానికి అకౌంట్లు సీజ్ చేయడం శోచనీయమన్నారు. జగన్ కాంగ్రెసులో ఉంటే ఇంత కుట్ర జరిగి ఉండేది కాదన్నారు. ఛార్జీషీటులో బలం లేకపోవడం వల్లనే సిబిఐ రాద్ధాంతం చేస్తోందన్నారు.
జగన్ మీడియా ఖాతాల స్తంభనపై మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత గాదె వెంకట రెడ్డి పార్టీ నేతలకు భిన్నంగా స్పందించారు. ఆయన జగన్ పార్టీ నేతలతో గొంతు కలిపారు! ఖాతాల స్తంభన విషయంలో సిబిఐది తొందర పాట చర్య అన్నారు. సాక్షి అకౌంట్ల సీజ్ చట్ట విరుద్దమైన చర్య అన్నారు. కోర్టు అనుమతితో నోటీసులు అందించి సీజ్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
విచారణ సంస్థలు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సిబిఐ దూకుడుగా వ్యవహరించడం వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఈ వ్యవహారం వల్ల జగన్ పైన కాంగ్రెసు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలకు ఊతమిచ్చినట్లయిందన్నారు. ఇకనైనా దర్యాఫ్తు సంస్థలు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు.