సిఎంపై జగన్ ఖాతాల స్తంభన ఎఫెక్ట్: తప్పు చేస్తే శిక్ష
ఎయిర్ పోర్టులో కొద్దిసేపు జర్నలిస్టులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి ఎదుట తమ నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. సాక్షి వ్యవహారంలో జర్నలిస్టులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. దీంతో అతను ఖాతాల స్తంభన వ్యవహారంపై స్పందించారు. జగన్ ఆస్తుల కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని చెప్పారు.
సిబిఐ విచారణతో ప్రభుత్వానికి గానీ, పార్టీలకు గాని సంబంధం లేదని చెప్పారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. సాక్షి వ్యవహారం సిబిఐ చూసుకుంటుందని చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇతర ఛానళ్లు, పత్రికలకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు ఎక్కడా భంగం వాటిల్లడం లేదన్నారు.
సాక్షి విషయంలో కూడా అలాంటిది లేదన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాయకరావుపేటలో సుమనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాగా ఆయన విశాఖపట్నం నుండి ఉప ఎన్నికల ప్రచారం కోసం పాయకరావుపేటకు బయలుదేరి వెళ్లారు.