జగన్, విజయ సాయి రెడ్డి బెదిరించారు: సిబిఐ కౌంటర్
తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐ మాధవచంద్రన్ను వైయస్ జగన్మోహన్ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బెదిరించారని సిబిఐ తెలిపింది. ఆయనను బెదిరింపులకు గురి చేసి రూ.39.60 కోట్లు పెట్టుబడులు పెట్టించారని అందులో పేర్కొన్నారు. లంచాలను పెట్టుబడుల రూపంలో చూపారని తెలిపారు.
జగన్కు చెందిన జగతి కంపెనీలలోకి 2011వ సంవత్సరంలో రూ.1172 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. సిబిఐ దర్యాఫ్తు ప్రారంభమయ్యాక కేవలం రూ.249 కోట్లు మాత్రమే మిగిలాయని, మూడు ఛార్జీషీట్లలో రూ.74 కోట్లు బయట పెట్టామని, ఇంకా ఆలస్యం చేస్తే ఖాతాలలోని డబ్బు తారుమారు అయ్యే అవకాశముందని, అందుకే ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు కౌంటర్ పిటిషన్లో సిబిఐ పేర్కొంది. కాగా వాదనలు పూర్తయిన అనంతరం కోర్టు తీర్పును 14వ తేదికి వాయిదా వేసింది.
కాగా రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ల బ్యాంక్ ఖాతాలను సిబిఐ స్తంభింప చేసిన విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సహా పలు అకౌంట్లను స్తంభింప చేసింది. తమ అకౌంట్లను తెరిపించాలంటూ సాక్షి బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది.
తమ కంపెనీలో ఇరవై వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, స్తంభింప జేస్తే వారు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని పిటిషన్లో పేర్కొన్నాయి. తాము రూ.25 కోట్లు న్యూస్ ప్రింట్కు వినియోగిస్తున్నామని తెలిపింది. నెలకు రూ.8 కోట్ల జీతాలు చెల్లిస్తున్నామని, రూ.103 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, 14 లక్షల సర్క్యులేషన్ ఉందని తెలిపింది. ఈ సందర్భంగా సాక్షి టెలివిజన్, దిన పత్రికల నిర్వహణ, ఖర్చు, న్యూస్ ప్రింట్, ఉద్యోగుల జీతభత్యాలు తదితరుల పూర్తి వివరాలను పిటిషన్లో కోర్టుకు వివరించింది.
స్తంభన ద్వారా ఉద్యోగులు జీవించే హక్కును కాలరాశాలని వారు ఆరోపించారు. రాష్ట్రంలో అత్యధిక సర్య్కులేషన్ ఉన్న పత్రిక సాక్షియేనని చెప్పారు. సాక్షి వేసిన పిటిషన్ను స్వీకరించిన నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. దీంతో సిబిఐ ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది.