వివరాలివ్వాలని పిటిషన్: జగన్ మెడకు 'ఈడి' ఉచ్చు!
పెట్టుబడుల పేరిట జరిగిన అక్రమాలపై సిబిఐ నిగ్గు తేల్చిన అంశాల ఆధారంగా... అడుగు ముందుకు వేయనుంది. అనుమానిత సంస్థలకు నిధులు ఎలా వచ్చాయి? అవి ఏమయ్యాయి? చట్టాల ఉల్లంఘన జరిగితే అది ఏ మేరకు? ఇలా మూడు కోణాలపై ప్రధానంగా దృష్టి పెడుతోంది. జగతి కేసులో సిబిఐ ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలనూ స్తంభింప చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసలు జగతి కేసులో ఈడి పరిధిలోకి వచ్చే మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన జరిగిందా? అయితే అది ఏ మేరకు? అని మరింత సాధికారంగా తెలుసుకునేందుకు... సిబిఐ ఇప్పటిదాకా సేకరించిన వివరాలు ఇప్పించాలని నాంపల్లి సిబిఐ కోర్టులో ఈడి సోమవారం ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్, చార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. ఈడి నేరుగా కేసులు నమోదు చేయనప్పటికీ... విజిలెన్స్, సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన అభియోగాల ఆధారంగానే ముందుకు వెళ్తుంది.
తన పరిధిలోకి వచ్చే మనీలాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘనపై దృష్టి సారిస్తుంది. దర్యాప్తు చేస్తుంది. జగతి కేసులో ఇప్పటికి మూడు అభియోగపత్రాలు దాఖలైనా, ప్రస్తుతానికి కోర్టు మొదటి అభియోగపత్రాన్నే పరిగణనలోకి తీసుకుంది. జగన్ సంస్థల్లోకి విదేశీ నిధులు వచ్చాయని సిబిఐ ఇప్పటికే కోర్టుకు నివేదించింది. ముఖ్యంగా మారిషస్, బ్రిటన్ వర్జిన్ ఐలాండ్, మలేషియా, దుబాయ్, ఫ్రాన్స్, సింగపూర్ల్లోని కొన్ని సంస్థలు జగతిలో పెట్టుబడులు పెట్టాయని కోర్టుకు తెలిపింది.
కంపెనీల గుట్టు బయటపెట్టేందుకు ఆయా దేశాలకు లెటర్ ఆఫ్ రొగేటరీ(ఎల్ఆర్)లు కూడా పంపింది. విదేశాల నుంచి అందాల్సిన వివరాల మాట ఎలా ఉన్నప్పటికీ... ఇక్కడి సంస్థలు చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే, ఇక్కడ లభించిన వివరాల ఆధారంగా ఈడి దర్యాప్తు జరిపి ఢిల్లీలోని అడ్జుకేటింగ్ అథారిటీకి నివేదిస్తుంది. అందులో భాగంగానే సిబిఐని ఈడి జగతి వివరాలు అడిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈడి ఎఫ్ఐఆర్ తీసుకుంది.
నేరంతో సంబంధం ఉన్న ఆస్తులను జప్తు చేసే అధికారం ఈడికి ఉంది. ఒకవేళ ఆస్తులను జప్తు చేస్తే అడ్జుకేటింగ్ అథారిటీ నుంచి 180 రోజుల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. న్యాయనిర్ణయాధికారి సంస్థ ముందు నేరంతే సంబంధం ఉన్న వారు తమ వాదనను వినిపించుకునే అవకాశముంటుంది. జప్తునకు ఆమోదం లభిస్తే దినిపై నిందితులు హైకోర్టును ఆశ్రయించవచ్చు.