కెసిఆర్ టార్గెట్: పరకాలకు సుష్మా స్వరాజ్

పరకాల ప్రచారానికి హేమాహేమీలను రంగంలోకి దింపేందుకు బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తోంది. మహబూబ్నగర్ ప్రచారానికి హేమమాలిని వంటి నాయకులను కూడా ప్రచారానికి దింపింది. పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి బిజెపి అగ్ర నేత సుష్మా స్వరాజ్ రానున్నారు. అయితే, ఆమె పరకాలకు వచ్చే తేదీ ఖరారు కావాల్సి ఉంది.
కాగా, పరకాల సీటుకు బిజెపి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. జాతీయ నాయకులను ప్రచారంలోకి దింపడంతో పాటు అన్ని స్థాయిల నాయకులను కూడా పరకాలలో మోహరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణలో రాజకీయ పరిస్థితులను, పరకాల స్థితిని సమీక్షించింది. మైనారిటీలను బుజ్జగిస్తూ వోటు బ్యాంకు రాజకీయాలకు కెసిఆర్ పాల్పడుతున్నారని బిజెపి విస్తృతంగా ప్రచారంలోకి తేవాలని చూస్తోంది.
ముస్లిం మైనారిటీల కోసం తెరాస పని చేయడం లేదని బిజెపి నాయకుడు కె. లక్ష్మణ్ విమర్సించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనారిటీ అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెసుకు తెరాస శాసనసభ్యులు ఓటేశారని ఆయన విమర్శించారు. తన సేవలను గుర్తించకపోవడంతో రెహ్మాన్ తెరాసను వదిలిపెట్టారని ఆయన అన్నారు.
కాగా, పరకాల విషయంలో వెనక్కి తగ్గడానికి తెరాస ఏ మాత్రం సిద్దంగా లేదు. పరకాల సీటుకు తన అభ్యర్థిని తెరాస నిర్ణయించింది. బిక్షపతిని రంగంలోకి దించాలని నిర్ణయించింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. రేపు బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. తాము అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications