వైయస్ జగన్పై హోరెత్తిన కాంగ్రెసు నేతల వ్యాఖ్యలు
అలాగే రాజకీయాల్లో కూడా తన తండ్రి మరణించిన వెంటనే జగన్ సీఎం పదవే కావాలని కోరడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని మోసంచేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నట్టు వస్తున్న ఆరోపణల నుంచి రక్షణ పొందేందుకే జగన్ అధికారం కోసం పాకులాడుతున్నారన్నారు. అతని పత్రిక, చానల్కు ఏవిధంగా డబ్బులు వచ్చాయో కొద్దిరోజుల్లోనే తెలుస్తుందన్నారు. జగన్ అవినీతి సొమ్ముకు అతని నివాసమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. జగన్ తప్పిదంవల్లే నేడు రాష్ట్రంలో 17 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రోడ్డున పడ్డారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పాలనలో ప్రజలకు బూడిద మాత్రమే మిగిలిందని ధ్వజమెత్తారు.
ప్రజల సంక్షేమం కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టనా కేవలం జగన్తోనే కాంగ్రెస్ పార్టీకి మలినం పట్టిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పోలాకిలో కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికివుంటే పార్టీని విడేవారు కాదని కేవలం జగన్ అధికారం కోసం పార్టీని వీడారన్నారు.
పొందరి, దమ్మల, శిష్టకరణాలను కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల్లో చేర్చితే, వైఎస్ చేర్చినట్లు స్థానిక నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై విడుదల చేసిన బుక్లెట్ తీసుకొని గ్రామాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పాన్ని దెబ్బకొట్టిన మొదటి వ్యక్తి జగనే అని మంత్రి ధర్మాన అన్నారు. అలాంటి కాంగ్రెస్ ద్రోహిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముంటున్నాడని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వైఎస్ఆర్ను రెండుసార్లు సీఎం చేసిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య విమర్శించారు. మంగళవారం వరంగల్ జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వైఎస్.జగన్ అక్రమంగా డబ్బులు సంపాదించాడని, సీఎంను చేయలేదని కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరగబడ్డ ఆయన ఎందుకు కాంగ్రెస్ పేరు పెట్టుకున్నారని మంత్రి సారయ్య ప్రశ్నించారు. వేరే పేరు పెట్టుకుంటే ప్రజలు తిరస్కరిస్తారని తన పార్టీకి చివర్లో కాంగ్రెస్ను చేర్చారని దుయ్యబట్టారు.
ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి ఆదరిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ పేరుంది కాబట్టే కొద్ది మాత్రమే ఆదరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది 2014 ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయని మంత్రి అన్నారు. ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి ఆదరిస్తున్నారు. పరకాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు భారీ మెజార్టీతో గెలుస్తాడని సారయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమా వేశంలో ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మంత్రి బొచ్చు సమ్మయ్య, పీసీసీ మాజీ మెంబర్ చిదిరాల సుధాకర్రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి అసోద రాజయ్య, దేశిని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.