వైయస్ ప్రభుత్వం నిమ్మగడ్డకు సహకరించింది: సిబిఐ
వాన్పిక్ ప్రాజెక్టు కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 13 వేల ఎకరాలు వైయస్ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్కు కట్టబెట్టారని, నిమ్మగడ్డ ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంస్థల్లో 854 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని సిబిఐ తెలిపింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్పిక్ కోసం రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ భూముల సేకరణను చేపట్టిందని చెప్పింది. ఈ సమయంలో బ్రహ్మానంద రెడ్డి మౌలిక సదుపాయాలు, పెట్టుబపడుల ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.
నిమ్మగడ్డ స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారని సిబిఐ ఆరోపించింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ రాయితీలు ఇచ్చినట్లు సిబిఐ తెలిపింది. వాన్పిక్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటా తగ్గడానికి బ్రహ్మానంద రెడ్డి కారణమని ఆరోపించింది. జీవో నెంబర్ 30 ద్వారా వాన్పిక్కు సంబంధించి మినహాయింపులు ఇచ్చారని చెప్పింది. వాన్పిక్లో పలు ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించింది.
రైతుల నుంచి చాలా తక్కువ ధరకు భూములు సేకరించారని, భూములు సేకరించాలని బ్రహ్మానంద రెడ్డి రెండు జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారని చెప్పింది. భూములకు రైతులకు 150 కోట్ల రూపాయలు చెల్లించి, 450 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేశారని, దీంట్లో 300 కోట్ల రూపాయల మోసం జరిగిందని సిబిఐ వివరించింది. వాన్పిక్ ఓడరేవుకు బదులు ప్రాజెక్టుకు భూములు కేటాయించాలని బ్రహ్మానంద రెడ్డి లేఖలు రాసినట్లు తెలిపింది.
మంత్రి వర్గ నిర్ణయం జరగకుండానే బ్రహ్మానంద రెడ్డి వాన్పిక్ వ్యవహారంలో జీవో జారీ చేశారని సిబిఐ ఆరోపించింది. బ్రహ్మానంద రెడ్డి వల్ల వాన్పిక్ ప్రయోజనం పొందిందని చెప్పింది. కాగా, సిబిఐ అధికారులు నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి బ్యాంక్ క్రెడిట్ కార్డును, సింగపూర్ గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు.