జగన్ కేసులో చట్టం తన పని తాను...: దామోదర
కోర్టు ఆదేశాల మేరకే సిబిఐ పని చేస్తోందని ఆయన అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిబిఐని కాంగ్రెసు సంస్థగా ఆరోపించారని, ఇప్పుడు సిబిఐ పని తీరుపై అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు 8 స్థానాలు గెలుస్తుందని ఆయన చెప్పారు. ప్రధాన పోటీ కాంగ్రెసు తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంటుందని ఆయన చెప్పారు.
జగన్ అక్రమాస్తుల కేసులో ఎంతటివారినైనా విచారించాల్సిందే అని, చట్టానికి ఎవరూ అతీతులు కారని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఉదయం గుంటూరులో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వాన్పిక్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాన్పిక్కు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకుని మత్స్యకారులకు, రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఆయన కోరారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. వాన్పిక్ను వెంటనే రద్దు చేయాలని ఎప్పుడో చెప్పినట్లు ఆయన అన్నారు. వాన్పిక్లో అక్రమాలు జరిగాయని, వేలాది పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని మంత్రి మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు.
అవినీతి మంత్రులు సీబీఐ ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారని, సిగ్గు, శరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. జగన్ పార్టీ అవినీతి నుంచే వచ్చిందని ఆయన గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. మద్యం కుంభకోణంలో చిక్కుకున్న మంత్రులను ప్రభుత్వం కాపాడాలని ప్రయత్నిస్తోందని నారాయణ ఆరోపించారు.